కవిత లేఖతో మతి భ్రమించిన కేటీఆర్‌ సీయం రేవంత్‌ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ పీపీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. కాళేశ్వరం స్కామ్లో కేసీఆర్కు, హరీశ్రావుకు నోటీసులు అందడంతో షాక్ తిన్న కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ కి పట్టిన దెయ్యం కేటీఆరే అని కవిత చెప్పకనే చెప్పారని మహేష్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ మూడు ముక్కలాటలో కవిత విడిపోవడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు జోస్యం చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసి ఉన్నట్లు కవిత లేఖలో స్పష్టంగా చెప్పుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. ఎన్నడూ లేని విధంగా బీజేపీ నేతలు కేసీఆర్ ను పొగుడుతూ, సానుభూతి తెలుపుతుండటమే వారిద్దరి మైత్రికి నిదర్శనమన్నారు. పదేళ్ళ పాలనలో మీ కుటుంబం చేసిన అవినీతి బయటపడకుండా ఉండేందుకు నరేంద్రమోడీ, అమిత్ షాల కాళ్ళు పట్టుకున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. నేషనల్ హెరాల్డ్ ఈడీ కేసు బీజేపీ కక్షపూరితంగా కాంగ్రెస్పై సృష్టించిన కేసు... కాంగ్రెస్ సొంత పత్రికకు ఆ పార్టీ వారు నిధులు ఇవ్వడం అవినీతి ఎట్లా అవుతుందని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. కాళేశ్వరం, మేడిగడ్డ, విద్యుత్ ఒప్పందాలు, ఫార్ములా రేస్ ఇలా ఒకటేమిటి మీ అవినీతి జాబితాకు అంతే లేదని ఆరోపించారు. మీరు చేసిన కాంట్రాక్టులు, దందాలు మరిచి కాంగ్రెస్పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక వైపు కవిత, మరోవైపు కాళేశ్వరం కేసుతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేటీఆర్ ఎటూ పాలుపోక చివరికి మీడియాపై కూడా విమర్శలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ విమర్శించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story