కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో తనపై కావాలనే నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెలిఫోన్‌ టాపింగ్‌ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ర్పచారం చేస్తున్నవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ హెచ్చరించారు. అబద్దాలు, అసత్యాలు, దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన తేల్చిచెప్పారు. కావాలని కొన్ని మీడియా సంస్ధలు, కొంతమందితో జట్టు కట్టి ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారానికి చట్టపరంగానే సమాధానం చెపుతామన్నారు. గత కొన్ని నెలలుగా కొంతమంది విలేకరుల వేషం వేసుకున్న మీడియా సంస్ధల యజమానులు నాపైన వ్యక్తిగతంగా, మా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వంపైనా విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తుల వల్ల కానీ వారు వ్యక్త పరుస్తున్న నీచమైన అభిప్రాయాలు కానీ నాపైన ఎటువంటి ప్రభావం చూపించవని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ పదే పదే వీరు చేస్తున్న వ్యక్తిత్వ హననం వల్ల మా కుటుంబ సభ్యులపైన తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తోందని కేటీఆర్‌ అన్నారు. మీడియా ముసుగులో వీరు చేస్తున్న దాడులు నా శ్రేయోభిలాషులను, పార్టీ నాయకులను, శ్రేణులను బాధ కలిగిస్తున్నాయన్నారు. ఒక్కొక్కరిపైనా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. వెనక ఉండి నడిపిస్తున్న వారితో పాటు, దుర్మార్గపూరితంగా ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి తగిన రీతిలో బుద్ధి చెపుతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు.

Updated On 28 Jun 2025 3:38 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story