మేడిగడ్డ బ్యారేజీపై ఎల్ అండ్టీ సెన్సేషనల్ లెటర్

మేడిగడ్డ బ్యారేజీ పనితీరుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ తీవ్రంగా స్పందించింది. బ్యారేజీ ఫెయిలైందని ప్రకటించడాన్ని తాము ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది. తగిన సాంకేతిక పరీక్షలు నిర్వహించకుండా ఈ నివేదిక ఇవ్వడాన్ని అన్యాయంగా పేర్కొంది. సాంకేతికంగా నిర్థారించిన సమాచారం ఏదీ లేకుండానే బ్యారేజ్ ఫెయిలైందని ఎలా నిర్ణయించారని ఎల్ అండ్ టీ సంస్థ ప్రశ్నించింది. నిర్మాణ సమయంలో క్వాలిటీ కంట్రోల్ పాటించలేదనే ఆరోపణలను తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించిన తమ నివేదికను అధికారికంగా సమర్పించామని గుర్తు చేసింది. నివేదికలో 283వ పేజీలో తమ క్వాలిటీ కంట్రోల్ డాక్యుమెంటేషన్ను ఎన్డీఎస్ఏ పేర్కొన్నప్పటికీ, అదే నివేదికలో కొన్ని చోట్ల దీనిని తిరస్కరించడాన్ని ఎల్ అండ్ టీ తగని వ్యవహారంగా అభివర్ణించింది. బ్యారేజీ పనితీరు, దెబ్బతినడానికి గల కారణాలపై సమగ్రంగా అంచనా వేసేందుకు తగిన పరీక్షలు అవసరమని ఎన్డీఎస్ఏ నివేదికలో స్వయంగా పేర్కొన్న విషయాన్ని కూడా గుర్తు చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యారేజ్ విఫలమైందని నిర్ధారించడాన్ని తప్పుబట్టింది. బ్యారేజీ పునరుద్ధరణపై ఇదివరకే ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికీ పరిస్థితులపై సమర్థవంతమైన సాంకేతిక విశ్లేషణే తుది అంచనాలకు ప్రాతిపదిక కావాలని ఎల్ అండ్ టీ పేర్కొంది.
