పాతికేళ్ళకు ప్రణాళికలు సిద్దం చేయండి
మున్సిపల్ శాఖ సమీక్షలో సీయం

నగరంలో శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో డెంగ్యూ, చికున్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ మున్సిపల్ పరిపాలనా, పట్టణాభివృద్ధి శాఖపై ఆశాఖ ఉన్నతాధికారులతో సీయం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ అధికారులు సీయంకు వివరించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతన్న తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పనుల పురోగతిపై కూడా సీయంకు జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీయం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీయం సూచించారు. వానకాలంలో డ్రైనేజ్ ఓవర్ ఫ్లో కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వర్షాల కారణంగా డ్రైనేజ్ వాటర్ కలసిపోయి తాగు నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలని, దోమల నివారణకు తగిన చర్యలు తతీసుకోవాలని సీయం సూచించారు. హైదరాబాద్ నగరాభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి వివరాలను జీహెచ్ఎంసీ అధికారులు సీయంకు తెలియజేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజయన్ లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సీయం చెప్పారు. ఈ సారి సమీక్షా సమావేశానికి తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పూర్తి ప్రణాళికలతో రావాలని మున్సిపల్ అధికారును ముఖ్యమంత్రి ఆదేశించారు. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్ర పాలసీ తయారుచేయాలని సీయం చెప్పారు.
