తెలంగాణలో లక్ష రేషన్ కార్డులు రద్దు!

తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. భారీ ఎత్తున రేషన్ కార్డులను రద్దు చేసేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ చేపట్టిన క్షేత్రస్థాయి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గడిచిన ఆరు నెలల నుంచి రేషన్ బియ్యం తీసుకోని వాళ్ల వివరాలు సేకరించారు. ఈ లెక్కలు తీస్తే.. దిమ్మదిరిగే వ్యవహారం బట్టబయలయ్యింది. ఏకంగా 96 వేల రేషన్ కార్డులు అనుమానాస్పదంగా గుర్తించారు. పౌర సరఫరాల శాఖ అధికారులు చేపట్టిన విచారణలో మే 22వ తేదీ వరకు చూస్తే.. మొత్తం 6 వేలకు పైగా రేషన్ కార్డులు అర్హత లేనివిగా తేల్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలకు రేషన్కార్డే ప్రాథమికంగా ఉండటంతో.. కొత్తగా రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని కొందరు అనర్హులు వినియోగించుకొని అక్రమంగా రేషన్కార్డులు పొందుతున్నారని తెలుస్తోంది. మే మొదటి వారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 90.71 లక్షల రేషన్కార్డులు ఉండగా.. వాటి పరిధిలో 2.93 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా. వీరి కోసం ప్రభుత్వం ప్రతి నెలా 1.90 లక్షల టన్నుల బియ్యాన్ని డీలర్లకు పంపిస్తోంది. సన్న బియ్యం పథకం అమలు చేస్తున్న తర్వాత ఎక్కువగా నిరుపేదలు రేషన్ తీసుకోవడానికి బారులు తీరుతున్నారు. అయితే, 1.6 లక్షల మంది రేషన్ కార్డు దారులు మాత్రం ఆచూకీ లేకుండా పోయారు. వారు రేషన్ తీసుకుంటున్నట్లు ఎక్కడా రికార్డుల్లో నమోదు కావడం లేదు. దీంతో.. పౌరసరఫరాల శాఖ అధికారులు ఆ లిస్ట్ తీసి.. ఆయా మండలాల్లో తహసీల్దార్ల ద్వారా క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తున్నారు. లబ్ధిదారులు వాళ్ల రేషన్ కార్డులు ఉన్న అడ్రస్లలో నివసిస్తున్నారా, లేదా మరణించారా? ఎక్కడికైనా వలస వెళ్లారా? అనే అంశాలు పరిశీలిస్తున్నారు. ఇక, ఈ విచారణలో.. వందేళ్ల వయస్సు పైబడి చనిపోయిన వారి పేర్లు కూడా రేషన్ లబ్ధిదారుల జాబితాలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. మరికొందరికి రెండు వేర్వేరు కార్డుల్లో పేర్లున్నట్లు కూడా సమాచారం. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయానికి పంపిస్తున్నారు.
రేషన్కార్డుల విచారణలో సూర్యాపేట జిల్లా 100 శాతం విచారణను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత కామారెడ్డిలో 83 శాతం, సిరిసిల్లలో 68 శాతం, కరీంనగర్లో 63 శాతం విచారణ పూర్తయ్యింది. అయితే.. 12 జిల్లాల్లో మాత్రం ఈ విచారణ ఇంకా మొదలే కాలేదు. ఇప్పటివరకు జరిగిన విచారణలో, కామారెడ్డిలో 726, సిద్దిపేటలో 519, ఖమ్మంలో 371, సిరిసిల్లలో 360, కరీంనగర్లో 330, యాదాద్రిలో 176, మెదక్లో 106 కార్డులు అనర్హమైనవిగా తేలాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విచారణ పూర్తయిన తర్వాత.. వరుసగా ఆరు నెలల నుంచి రేషన్ తీసుకోని వారిని.. అర్హత లేకున్నా.. రేషన్ కార్డులు పొందిన వారి కార్డులను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రభుత్వ వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి సహాయపడుతుందంటున్నారు. అంతే కాకుండా.. ఈ కేవైసీ చేయించుకోని వారి కార్డులను కూడా తొలగించే అవకాశాలు ఉన్నాయి.
