Kalwakuntal Kavita : ఓ లిల్లీపుట్ నాయకుడు… ఓ మహా నాయకుడు… కవిత... ఇది కథ
మరోసారి బీఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడ్డ కల్వకుంట్ల కవిత

ఓ లిల్లీపుట్ నాయకుడు నా గురించి కామెంట్ చేస్తాడా అంటు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత గుంటకండ్ల జగదీష్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో తనపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కవిత పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాడని, ఆమె వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని వ్యాఖ్యలు చేస్తున్నాడని కవిత మండిపడ్డారు. దీంతో జగదీష్రెడ్డి పేరు ఎత్తకుండా ఆయనను ఉద్దేశించి కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఆ లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేశాడని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యవక్తం చేశారు. జిల్లాలో అన్ని సీట్లు ఓడిపోవడానికి ఆయనే కారణమన్నిరు. చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు ఏదో గెలిచాడని ఎద్దేవా చేశారు. నా గురించి ఇంకోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పరోక్షంగా జగదీష్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు కవిత. ఇక్కడితో ఆగకుండా కల్వకుంట్ల కవిత మరో సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఓ ముఖ్య నాయకుడు జాగృతిలో కొందరు కోవర్టులను పెట్టి ఇక్కడి సమాచారం అంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ నాయకుడికి తెలియంది ఏంటంటే ఆయన దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు… అక్కడ ఏం జరుగుతోందో నాకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని కవిత వ్యాఖ్యానించారు. ఆ ముఖ్యనాయకుడి ఆదేశాలతోనే నాపై లిల్లీపుట్లు దాడులు చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై దాడులు జరిగితే పార్టీ నేతల ఎవరూ స్పందించ వద్దని ఆ ముఖ్యనేత నుంచి ఆదేశాలు ఉన్నట్లు నా దగ్గర స్పష్టమైన సమాచారం ఉందని కవిత పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా కవిత తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నా ఉద్యమ ప్రస్ధానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు అని జగదీష్రెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. కేసీఆర్ వ్యతిరేకులకులైన రాధాకృష్ణా, రేవంత్రెడ్డిలు మాట్లాడిన మాటలనే ఇప్పుడు కవిత వల్లెవేస్తున్నారని వ్యాఖ్యానించారు. కొంత మంది ఏదో చేసేద్దామని అనుకుంటారు, కానీ వ్యక్తులుగా ఏదో చేయగలమనుకుంటే అది వారి భ్రమ అని అన్నారు. నేను చావు తప్పి కన్ను లోట్టపోయినట్లు అయినా గెలిచాను, కొంత మంది అలా కూడా గెలవలేకపోయారు కదా అని అన్నారు. నల్గొండలో అంతకు ముందు ఎక్కువ సీట్లు వచ్చాయి అప్పుడు కూడా నేనే కారణమన్నారు… ఇప్పుడు ఒక్క సీటు వచ్చిన దానికి నేనే కారణమంటున్నారు. అంతిమంగా పార్టీ నిర్ణయమే ఫైనల్, పార్టీ మాత్రమే గొప్పదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కవితకు స్ట్రాంగ్ కౌంట్ ఇచ్చారు.
