Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన ఆమె బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. అనంతరం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు.

‘‘నన్ను రాజీనామా చేయమని ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదు. అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నాను’’ అని కొండా సురేఖ అన్నారు.

బీసీ కులస్థురాలైన తన విషయంలో ఒక రకమైన న్యాయం, ఇతర సామాజిక వర్గాలకు మరో రకమైన న్యాయం పాటిస్తారా అని ఆమె ప్రశ్నించారు. ‘‘క్యాబినెట్‌లో ఉన్న ఇతర సామాజిక వర్గాల నేతలపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారు?’’ అని అడిగారు.

అన్ని వ్యవహారాలపై ఇప్పటికే ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా అధిష్ఠాన ముఖ్యులందరికీ రాతపూర్వకంగా తెలియజేశానని సురేఖ చెప్పారు. ‘‘అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఇవాళ ఖర్గేను కలిసిన సందర్భంగా కోరాను’’ అని ఆమె పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ‘‘పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్‌ ఎలా చెబుతారు?’’ అని ప్రశ్నించారు.

ఇలా కొండా సురేఖ అధిష్ఠానం వైపు చూపుతూ తన వైఖరిని స్పష్టం చేశారు.

Next Story