Palamuru–Rangareddy Lift Irrigation Project: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొత్తం వ్యయం సుమారు రూ.85 వేల కోట్లకు చేరనుందని నీటిపారుదల శాఖ తాజా అంచనా వేసింది. మొదట 2015లో రూ.35,250 కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ పథకం, 2023లో రూ.55,086 కోట్లకు సవరించబడింది. ఈ రెండు అంచనాలూ 2015-16 ధరల ఆధారంగానే ఉన్నాయి.

ఇప్పటివరకు రూ.32,067 కోట్లు ఖర్చయ్యాయి. మిగిలిన పనులకు తాజా ధరలు వర్తింపజేయడం, పాత పనులకు పెరిగిన ధరల చెల్లింపు, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌కు భూసేకరణ ఖర్చు వంటి అంశాలను కలుపుకొని మొత్తం వ్యయం రూ.85 వేల కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పనులు సకాలంలో పూర్తి కాకపోతే ఖర్చు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

లిఫ్టుల్లో సగం పనులే పూర్తి...

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి కె.పి.లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు చేర్చి, 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా చేయడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం. మొత్తం 21 ప్యాకేజీలుగా విభజించిన పనుల్లో 18 ప్యాకేజీలకు టెండర్లు పిలిచి పనులు చేపట్టారు. లిఫ్టుల్లో సగం వరకు మాత్రమే పంపులు, మోటార్లు అమర్చారు. రిజర్వాయర్లు, ప్రధాన కాలువ పనులు ఎక్కువగా పూర్తయ్యాయి. 2023 డిసెంబరు నాటికి రూ.26,472 కోట్లు ఖర్చయితే, తర్వాత రెండేళ్లలో మరో రూ.5,595 కోట్లు జోడించి మొత్తం రూ.32 వేల కోట్లకుపైగా వెచ్చించారు.

డిస్ట్రిబ్యూటరీ పనులు ఇంకా ప్రారంభం కాలేదు

పలు ప్యాకేజీల్లో ఇంకా 25 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఎన్నికల ముందు డిస్ట్రిబ్యూటరీ టెండర్లు ఖరారైనా పనులు మొదలుకాలేదు. ఈ పనులన్నీ పాత ధరల ఆధారంగా ఒప్పందాలు జరిగాయి. ఉద్దండాపూర్ నుంచి కె.పి.లక్ష్మీదేవిపల్లి వరకు తాజా అంచనాలతో పనులు చేపట్టాల్సి ఉండగా, పెరిగిన ధరల చెల్లింపుతో మాత్రమే సుమారు రూ.10 వేల కోట్ల అదనపు భారం పడనుంది.

భూసేకరణకే రూ.7 వేల కోట్లు అవసరం

ప్రధాన కాలువ, రిజర్వాయర్ నిర్మాణానికి 3,500 ఎకరాలు, డిస్ట్రిబ్యూటరీలకు 30 వేల ఎకరాలు – మొత్తం 33,500 ఎకరాల భూమి సేకరణ అవసరం. దీనికి రూ.7 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. 2023 సవరణలో భూసేకరణ, పునరావాసానికి రూ.3,100 కోట్లు కేటాయించగా, ఇందులో ఎక్కువ భాగం ఖర్చయింది. మిగిలిన భూమికి ప్రస్తుత మార్కెట్ ధరలు, రైతుల డిమాండ్లు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌కు రూ.15 వేల కోట్లు పైగా

మునుపు రూ.1,107 కోట్లతో ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూటరీలు, ఉప కాలువల నిర్మాణం తాజా అవసరాల దృష్ట్యా రూ.15 వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. భూసేకరణతో కలిపి ఈ భాగానికే రూ.22 వేల కోట్లకు మించి అవసరం పడనుంది.

ఈ పథకం పూర్తయితే పాలమూరు ప్రాంతంలోని ఎడారి భూములు సస్యశ్యామలమవుతాయని, ఫ్లోరైడ్ సమస్య నుంచి గ్రామాలు ఉపశమనం పొందుతాయని అధికారులు ఆశిస్తున్నారు. అయితే ఖర్చు పెరిగ kipోవడం ప్రాజెక్టు పురోగతికి సవాలుగా మారింది.

Next Story