తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ దిశగా కొత్త మున్సిపాలిటీల్లో వార్డుల విభజన ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారుల నుంచి సంబంధిత ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వార్డుల విభజనకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.



రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు, 5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో కొన్నిటిలో సమీప గ్రామాలను విలీనం చేయడంతో ఆయా మున్సిపాలిటీల విస్తరణ పెరగనుంది. మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను విలీనం చేశారు. ఈక్రమంలోనే కొత్తగా ఏర్పాటు కానున్న మున్సిపాలిటీలలో వార్డుల విభజన కోసం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 21వ తేదీలోపు వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.



తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీ ఎన్నికల కోసం వార్డుల విభజన, ఓటరు జాబితా తయారు చేసింది. అదే తరహాలో పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటరు జాబితాను సిద్ధం చేయబోతోంది. త్వరలోనే రిజర్వేషన్‌ల ప్రక్రియను కూడా పూర్తి చేసి, ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.




వార్డుల విభజన జరగనున్న మున్సిపాలిటీల వివరాలు చూస్తే.. కొహిర్, కేసముద్రం, అశ్వరావుపేట, స్టేషన్ ఘనపూర్, మద్దూర్, ఎదులాపురం, దేవరకద్ర, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, చేవెళ్ల, మొయినాబాద్, ములుగు, బిచ్కుంద, కల్లూరు, అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేటల్లో వార్డులను విభజించనున్నారు. అలాగే, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కరీంనగర్, రామగుండం, కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్లలో కూడా వార్డుల విభజనకు నోటిఫికేషన్‌ వెలువడింది. వీటితో పాటు.. నర్సంపేట, పరిగి, కొల్లాపూర్, ఆలేరు, బాన్సువాడ, జగిత్యాల, హాలియా మున్సిపాలిటీల్లో కూడా కొత్తగా విలీనమైన గ్రామాలను కలుపుకొని వార్డుల విభజన చేయనున్నారు.



పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సంబంధిత శాఖలు అవసరమైన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నాయి.


Politent News Web4

Politent News Web4

Next Story