Minister Jupally Krishna Rao: అప్పులపై చర్చకు సిద్ధం.. బుకాయింపులు ఎందుకు? : మంత్రి జూపల్లి కృష్ణారావు
మంత్రి జూపల్లి కృష్ణారావు

Minister Jupally Krishna Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో చేసిన అప్పుల వివరాలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మొత్తం రూ.7.3 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు, వీటిలో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఒక్కటే రూ.74 వేల కోట్లు అప్పు చేసినట్లు ఆయన వివరించారు.
నేను చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని, కేసీఆర్ తాము అప్పులు చేయలేదని చెప్పాలని జూపల్లి సవాల్ విసిరారు. తన చెప్పినది అబద్ధమైతే రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కార్పొరేషన్ల పేరుతో అప్పులు చేసి కాళేశ్వరం నిర్మించామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, ఆ అప్పులను రైతుల నుంచి వసూలు చేస్తారా? ఒక్కో రైతు నుంచి రూ.20 లక్షలు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు.
మేం చేసిన ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని, తన వద్ద ఉన్న రికార్డులు, కాగితాలు ఇస్తానని, చర్చకు రావాలని మంత్రి జూపల్లి ఆహ్వానం పలికారు. మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ఇంకా బుకాయిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల వివరాలను కేసీఆర్ స్వయంగా మీడియాకు చెప్పాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ.6 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని జూపల్లి తెలిపారు.
మరోవైపు, అప్పులపై చర్చించడానికి తెలంగాణ భవన్కు వస్తానన్న మంత్రి జూపల్లి ఎందుకు రాలేదని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. కేటీఆర్ ఆయన కోసం వేచి చూస్తున్నారని చెప్పారు. చర్చకు సవాల్ విసిరిన మంత్రులు తోక ముడిచి పారిపోయారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
ఈ అంశంపై రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది.

