Revanth Reddy meets Rahul, Kharge

న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ పెద్దలతో వరుసగా సమావేశాలు అవుతున్నారు. నిన్ననే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌.. పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమైన తర్వాత.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ భేటీ అయ్యారు. ఆ తర్వాత.. పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలిశారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాల గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రేవంత్‌ ఢిల్లీ వెళ్లేముందే.. తెలంగాణ కేబినెట్‌లోకి ముగ్గురు మంత్రులను కొత్తగా తీసుకోవడం, వాళ్లతో ప్రమాణ స్వీకారం కూడా పూర్తియ్యింది. దీంతో, కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వాళ్లకు మంత్రివర్గ శాఖలు కేటాయింపు అంశంపై సీఎం రేవంత్‌ రాహుల్‌, ఖర్గేతో మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న కొందరు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు, చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇతర కీలక అంశాలపైనా ఢిల్లీ పెద్దలతో రేవంత్‌ మంతనాలు సాగించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలు, కార్యాచరణ గురించి కూడా చర్చ జరిగింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాలపై రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్‌పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. అయితే, ఈ సభల నిర్వహణకు తేదీలను ఖరారు చేయాలని.. ఆ సభలకు మల్లికార్జున ఖర్గేతో పాటు.. రాహుల్ గాంధీ తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని ఆహ్వానించారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రభుత్వం పరంగా, పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహాల గురించి కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం రేవంత్‌కు పలు సూచనలు చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా తమ రాష్ట్రంలో ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు రూపొందించాలని రేవంత్‌కు సూచించారు.


Politent News Web4

Politent News Web4

Next Story