Ponguleti: పొంగులేటి: రెవెన్యూ వ్యవస్థ ఆధునికీకరణతో ప్రజలకు వేగవంతమైన సేవలు అందజేస్తాం
ప్రజలకు వేగవంతమైన సేవలు అందజేస్తాం

Ponguleti: ప్రజలకు మరింత సులభమైన మరియు పారదర్శకమైన రెవెన్యూ సేవలను అందించేందుకు, తహసీల్దార్ మరియు ఆర్డీఓ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మొదటి దశలో అద్దె భవనాల్లో నడుస్తున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు మరియు 5 ఆర్డీఓ కార్యాలయాలకు ఆధునిక సదుపాయాలతో కూడిన శాశ్వత భవనాలను నిర్మిస్తామని ఆయన తెలిపారు. రెండో దశలో శిథిలావస్థలో ఉన్న 170 ఆర్డీఓ మరియు తహసీల్దార్ కార్యాలయాలను కొత్తగా నిర్మించనున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలను ఒకే మాదిరిగా, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా డిజైన్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో సంప్రదించి డిజైన్లకు అంతిమ రూపాన్ని ఇస్తామని చెప్పారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందే విధంగా ఈ భవనాల నిర్మాణం ఉంటుందని ఆయన విశదీకరించారు.
ఈరోజు సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి పొంగులేటి, అద్దె భవనాల్లో కొనసాగుతున్న తహసీల్దార్ మరియు ఆర్డీఓ కార్యాలయాల వివరాలను సమీక్షించారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ఆధునికీకరించి, ప్రజలకు త్వరిత సేవలను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

