RTC pass prices have increased drastically in Hyderabad.

తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం భారీ షాక్‌ ఇచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అమలవుతోన్న వివిధ రకాల బస్సు పాసుల ధరలను భారీగా పెంచేసింది. దీంతో, నెలవారీ పాసులతో ప్రయాణించే వాళ్ల జేబులు గుల్ల కానున్నాయి. అన్ని రకాల పాసులపై చార్జీలను 20శాతం పెంచేసింది. అంతేకాదు.. పెరిగిన చార్జీలు ఇవాల్టినుంచే అమలులోకి తీసుకొచ్చింది.

గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ బస్‌పాస్‌ల ధరలను 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా రూ.1150 ఉన్న ఆర్డీనరీ బస్ పాస్ ధరను రూ.1400కు పెంచేశారు. ఇప్పటివరకు రూ.1300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ నెలవారీ పాస్‌ ధరను రూ.1600కు పెంచారు. రూ.1450గా ఉన్న మెట్రో డీలక్స్ నెలవారీ బస్ పాస్ ధర రూ.1800కు పెరిగింది.

ఆర్టీసీ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చిన్న ఉద్యోగులు, దినసరి కూలీలు, తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు, తమ రోజువారీ ప్రయాణానికి ఆర్టీసీ బస్సు పాసులను వినియోగించుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఒక్కసారిగా పెద్దమొత్తంలో బస్‌పాసుల ధరలు పెంచడంతో తమ నెలవారీ బడ్జెట్‌పై ఎక్స్‌ట్రా బర్డెన్‌ పడుతుందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే భారీగా పెరిగిన నిత్యావసరాలతో సతమతమవుతుంటే.. బస్సు పాసుల పెంపు మరింత కుంగదీసేలా ఉందని వాపోతున్నారు.

తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలు ఈ నెల 12వ తేదీ నుంచి పునః ప్రారంభం కానుండటంతో విద్యార్థులకు స్టూడెంట్‌ బస్‌పాస్‌లపైనా ఆర్టీసీ యాజమాన్యం అప్‌డేట్ అందించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు జూన్ 12వ తేదీ నుంచి కొత్త బస్ పాస్‌లను జారీ చేయనుంది. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌ సిటీ వ్యాప్తంగా ఉన్న 40 ఆర్టీసీ కేంద్రాల్లో విద్యార్థులు బస్ పాస్‌లను పొందవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. కొత్త బస్ పాస్‌ల కోసం విద్యార్థులు ముందుగా ఆర్టీసీకి చెందిన www.tgsrtc.telangana.gov.in/bus-pass-services వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత, అప్లికేషన్ ఫారమ్‌ ప్రింట్ తీసుకుని, దానికి అవసరమైన సర్టిఫికెట్లు అటాచ్‌ చేసి తమకు దగ్గరలో ఉన్న బస్ పాస్ కౌంటర్లలో సమర్పించాలి. ఆ తర్వాత వారికి స్టూడెంట్ బస్ పాస్ అందజేస్తారని ఆర్టీసీ అధికారులు వివరించారు.


Politent News Web4

Politent News Web4

Next Story