సింగరేణి ప్రమాద బీమా పథకం దేశానికి ఆదర్శం

- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సింగరేణి ఉద్యోగి కుటుంబానికి రూ.1.2 కోట్ల ప్రమాద బీమా చెక్కును
- అందజేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సింగరేణిలో అమలు జరుపుతున్న ఉచిత ప్రమాద భీమా పథకం కింద ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన ఒక కార్మికుని కుటుంబానికి రూ.1.20 కోట్ల భీమా సొమ్ము చెక్కును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అందజేశారు. శనివారం మహాత్మా జ్యోతి రావ్ ఫూలే ప్రజా భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ చెక్కును మృతి చెందిన రామగుండం- 1 ఏరియాకు చెందిన సపోర్టు మెన్ పెండ్రి రంజిత్ కుమార్ భార్య లతకు అందజేశారు. సింగరేణి కార్మికుడు పెండ్రి రంజిత్ కుమార్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ ఖాతా ఉంది. ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మృతుడి నామినీగా ఉన్న భార్య లతకు రూ.1.2 లక్షల ప్రమాద భీమా కింద చెల్లించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ... సింగరేణి సంస్థలో అమలు జరుపుతున్న రూ.1.2 కోట్ల ప్రమాద భీమా పథకం ప్రభుత్వ రంగ సంస్థలకే గాక అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయ మైందన్నారు. అనుకోని ప్రమాదంలో కార్మికుడు మృతి చెందినట్లయితే అతని కుటుంబం వీధిన పడకుండా ఆర్థిక భరోసా కల్పించడం కోసం ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. మృతుని కుటుంబానికి త్వరలో కారుణ్య నియామక పత్రాలు అందచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, రెడ్కో వైస్ ఛైర్మన్, ఎండీ ఆనీలా, ఎస్బీఐ డీజీఎం నీలాక్షి సింగ్, రీజనల్ మేనేజర్ సురేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్డిఎం సుభాని తదితరులు పాల్గొన్నారు.
