Public Auction: 23న ప్రభుత్వ స్థలాల బహిరంగ వేలానికి రంగం సిద్ధం..
బహిరంగ వేలానికి రంగం సిద్ధం..

Public Auction: హౌజింగ్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రభుత్వ స్థలాలు మరోసారి బహిరంగ వేలానికి రంగం సిద్ధమైంది. హౌజింగ్ శాఖ రూ.3వేల కోట్ల నిధుల సమీకరణకు వీలుగా విలువైన స్థలాలను విక్రయించేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్ర హౌసింగ్ బోర్డు నేతృత్వంలో ఇటీవల వేలం పాట నిర్వహించగా రికార్డు స్థాయిలో ధర పలికింది. ఇదే ఊపుతో ఉన్న ప్రభుత్వం, రాష్ట్ర హౌసింగ్ బోర్డుకు చెందిన, నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థలాలను విక్రయించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బాచుపల్లి మండలం నిజాంపేట్, కుత్బుల్లాపూర్ మండలం చింతల్, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని గచ్చిబౌలిలోని స్థలాలను విక్రయించాలని నిర్ణయించారు. ఈ నెల 23న నిర్వహించే బహిరంగ వేలం ద్వారా మొత్తం 22 స్థలాలను విక్రయించనున్నారు. కూకట్పల్లిలోని హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్-1లో ఖాళీగా ఉన్న 18 స్థలాలను రెండు రోజుల క్రితం విక్రయించగా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఓ ప్లాట్ను చదరపు గజం ధర అత్యధికంగా రూ.2.98 లక్షలుగా విక్రయించారు. అన్ని ప్లాట్లు కలిపి సగటున చదరపు గజానికి రూ.2.38 లక్షలు పలకడం విశేషం.
