K. T. Rama Rao: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం తగ్గేలా చర్యలు తీసుకుంటే అది సాధారణ రాజకీయ ప్రక్రియగా మిగలదని, మొత్తం దక్షిణాది అంతటా భారీ ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) స్పష్టం చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన అంశంపై బుధవారం ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) వేదికగా కేటీఆర్‌ స్పందించారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, మూడేళ్ల క్రితం తాము తీసుకున్న దృఢ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని ఆయన వివరించారు.

“దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాయి. ఈ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణ రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన సమయంలో వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం” అని కేటీఆర్‌ అన్నారు.

“దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంటులో మా ప్రజల స్వరాన్ని, ప్రాతినిధ్యాన్ని అణచివేయాలని చూస్తే మేం నిశ్శబ్దంగా ఉండబోము. దక్షిణాదికి అన్యాయం చేస్తే పెను ఉద్యమమే జరుగుతుంది” అని ఆయన హెచ్చరించారు.

కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు లోక్‌సభ సీట్ల పునర్విభజనపై దక్షిణ రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి మధ్య వచ్చాయి. జనాభా ఆధారంగా సీట్లు పెంచడం దక్షిణాదికి ప్రతికూలంగా మారుతుందని ఆయన సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story