తెలంగాణలో విజయవంతమైన స్లాట్ బుకింగ్ సిస్టం
జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు

వచ్చే జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణలోని అన్నిసబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే 47 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ ప్రక్రియ విజయవంతంగా అమలు అవుతుండటంతో.. ఇకపై అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం.. స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 47 ప్రాంతాల్లో ఈ ప్రక్రియ విజయవంతంగా అమలవుతోంది. స్లాట్ బుకింగ్ విధానంతో మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రయోగాత్మకంగా మొదటి దశలో ఏప్రిల్ 10వ తేదీన 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ మంచి ఫలితాలు రావడంతో మే 12వ తేదీ నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేశారు. ఈ రెండు విడతలు కలిపి 47 చోట్ల అమలు చేసిన విధానం విజయవంతమైందని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ రెండు విడతల్లో కలిపి దాదాపు 36 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. ఇప్పటికే అమలులో ఉన్న 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో మాదిరిగానే మిగిలిన 97 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించనున్నామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
జూన్ 2వ తేదీ నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తీసుకు రావాలని.. వీటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సులభతరమవుతుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఆస్తుల క్రయ విక్రయ దారులు స్లాట్ బుకింగ్ తర్వాత లాగిన్లో డిపార్ట్మెంట్ పోర్టల్లో పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు.స్లాట్ బుకింగ్ విధానం దృష్ట్యా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్ధీకరణ చేస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. పని భారం అధికంగా ఉన్న పఠాన్చెరువు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్లో మొత్తం తొమ్మిది చోట్ల అదనపు సబ్ రిజిస్ట్రార్తో పాటు సిబ్బందిని కూడా నియమిస్తున్నామని తెలిపారు. నిషేధిత జాబితాలోని ఆస్తులను ఎట్టి పరిస్దితుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. భూ భారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్ను ఏర్పాటు చేశామని, నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరచడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైనా నిషేధిత జాబితాలోని భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే క్షణాల్లోహైదరాబాద్ లోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయంలో ఆన్లైన్లో తెలిసిపోయేలా వ్యవస్ధను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక ఇప్పుడు తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ విధానం ద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే అవసరం ఉండదు. కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ చేస్తారు. స్లాట్ బుకింగ్ చేసుకోకుండా వచ్చే వారి రిజిస్ట్రేషన్లు చేయరు. ఈ విధానంలో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను అదే రోజు కొనుగోలుదారుకు అందజేస్తారు. నేరుగా registration.telangana.gov.in వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్దేశించిన సమయానికి నేరుగా వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.
