TBGKS : టిబీజీకేఎస్ కోశాధికారి తన పదవికి రాజీనామా
గౌరవాధ్యక్షపదవి నుంచి కవితను తప్పించినందుకు నిరసన

సింగరేణి కార్మిక సంఘంలో జరుగుతున్న మార్పులు చేర్పులు భారతీయ రాష్ట్ర సమితి అగ్రనేతల మధ్య చిచ్చురేపుతోంది. తాజాగా టిబీజీకేఎస్ గౌరవాధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పదవి నుంచి తప్పించి ఆమె స్ధానంతో కేసీఆర్ నమ్మిన బంటు కొప్పుల ఈశ్వర్ను నియమించారు. అయితే కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టీబీజీకేఎస్లో వివాదాలకు కారణమయ్యింది. జనర్ బాడీ సమావేశం నిర్వహించకుండానే ఇంక పది సంవత్సరాల కాల పరిమితి ఉన్న కవితను గౌరవాధ్యక్షురాలి స్ధానం నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారి వెంకట్తో పాటు పలువురు సభ్యులు రాజీనామాలుచేశారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కవిత ఉన్నందుకే కేసీఆర్ను ఒప్పించి వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో ఇప్పించారని వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే 19463 నూతన ఉద్యోగాలను కూడా కవిత కృషి వల్లే భర్తీ అయ్యాయని వెంకట్ తెలిపారు. కల్వకుంట్ల కవిత చలవతో ఇంక్రిమెంట్లు, పది లక్షల గృహ రుణాలు, ఉచిత కరెంటు, ఉచిత ఏసీ సౌకర్యం, పది రెట్ల మ్యాచింగ్ గ్రాంట్, ఉన్నత విద్యకు ఫీజు రీయంబర్స్ మెంట్, అంబేద్కర్ జయంతి సెలవు దినం, సంక్రాంతి, క్రిస్మస్ పండుగలకు ఆప్షనల్ హాలిడేలు, కార్మికుల తల్లిదండ్రులకు ఉచిత కార్పొరేట్ వైద్యం ఎంఎంసీ 25 లక్షలకు పెంచుతూ ఏక మొత్తంలో చెల్లింపు ఇలా ఎన్నఓ కార్మిక సంక్షేమ కార్యమాలను అమలు చేయించారని టిబీజీకేఎస్ కోశాధికారి వెంకట్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి సింగరేణి కార్మికులకు మధ్య వారధిలా వ్యవహరించి ఇంత అద్భుతంగా పని చేసి కవితకు మీరు ఇచ్చిన బహుమతి ఇదా అని వెంకట్ ప్రశ్నిస్తున్నారు. త్వరలో కవిత ఆధ్వర్యంలో మేము బాయిబాట కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటామని ఆయన ప్రకటించారు. ఇదే దారిలో మరికొందరు టీబీజీకేఎస్ కీలక నేతలు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
