‘SIR’ Survey: రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను మరో పది రోజులు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్యూమరేషన్‌ పత్రాలను బీఎల్‌వోలకు అందించే గడువును ఆగస్టు 3 వరకు పెంచింది. మునుపటి షెడ్యూల్‌ ప్రకారం ఈ గడువు జులై 24 వరకు మాత్రమే ఉంది.

ఎన్యూమరేషన్‌ పత్రాల పంపిణీ, సేకరణ సమయం పొడిగింపు కారణంగా మిగతా షెడ్యూల్‌లో కూడా మార్పులు చేశారు. ఆగస్టు 3న పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడతారు. ముసాయిదా జాబితాను జులై 31 స్థానంలో ఆగస్టు 10న ప్రకటిస్తారు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వారు, చిరునామా మార్పుల కోసం ఫారం-6, ఫారం-8లు ఆగస్టు 10 తర్వాత సమర్పించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి (సీఈవో) వినతి పత్రాలు సమర్పించాయి. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లాల్లో ఎన్యూమరేషన్‌ పత్రాల సేకరణ నెమ్మదిగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఈవో సుదర్శన్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయగా, గడువు పొడిగింపు నిర్ణయం వెలువడింది.

రాష్ట్రంలో ఎన్యూమరేషన్‌ పత్రాల పంపిణీ బుధవారం నాటికి 100 శాతం పూర్తయిందని సీఈవో తన నివేదికలో తెలిపారు. ఈ మార్పుల వివరాలను సీఈవో సుదర్శన్‌రెడ్డి అధికారిక ప్రకటన ద్వారా ప్రకటించారు.

ఈ పొడిగింపు వల్ల ఓటర్ల సవరణ ప్రక్రియ మరింత సమగ్రంగా, సమర్థవంతంగా పూర్తి చేసే అవకాశం ఏర్పడింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story