Telangana Government: ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి మరో ఏడాది పొడిగింపు.. 44 ఏళ్లకు పెంచిన జీవో
44 ఏళ్లకు పెంచిన జీవో

Telangana Government: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవోను ఇటీవలే జారీ చేసింది. ఇప్పటి వరకు 43 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సడలింపు ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది.
పోలీసు శాఖ, ఇతర యూనిఫామ్ సర్వీసుల ఉద్యోగాలకు అయితే ఈ వయోపరిమితి పొడిగింపు వర్తించదునని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని గరిష్ఠ వయోపరిమితిని మొదట పదేళ్ల పాటు సడలించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించారు. ఆ గడువు ముగిసే సమయానికి నిరుద్యోగ యువత అభ్యర్థనలు, వినతులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తాజాగా మరో ఏడాది పొడిగించే నిర్ణయం చేసింది.
ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది నిరుద్యోగులకు ఊరట కల్పించనుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు ఈ పొడిగింపును స్వాగతించారు.

