• కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ
  • టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తాం
  • యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం
  • సింగరేణి 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించిన ఎమ్మెల్సీ కవిత
  • సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  • రాజకీయ పార్టీ స్ధాపన దిశగా కవిత అడుగులంటున్న పరిశీలకులు

సింగరేణి కాలరీస్... తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించే సంస్ధ. అత్యంత బలమైన కార్మిక సంఘాలు ఉన్న సంస్ధ. తెలంగాణలో దాదాపు ఆరు జిల్లాలో సింగరేణి కార్మిక సంఘాల ప్రభావం ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీకి సింగరేణిలో అనుబంధ కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈ సంస్ధకు జగిరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు దాదాపు ఒక అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తాయి. తాజాగా ఆ సంస్ధలో ఇప్పుడు తెలంగాణ జాగృతి సంస్ధ ఒక కార్మిక సంఘాన్ని ప్రారంభించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో గత పద్నాలుగేళ్లుగా తెలంగాణ జాగృతి సంస్ధ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆదే జాగృతి అనుబంధంగా సింగరేణి జాగృతి పేరుతో మారో కార్మిక సంఘాన్ని కవిత ప్రారంభించింది. ఇదేదో ఆషామాషీగా ప్రారంభించిన సంఘం కాదని బలమైన రాజకీయ ఉద్దేశాలతో స్ధాపించిన సంఘమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధం సంఘంగా టీబీజేకేఎస్ యాక్టీవ్ గా ఉంది. ఆ సంస్ధ ఉండగానే కవిత సింగరేణి జాగృతి సంఘాన్ని ప్రారంభించడం అందరికీ విస్మయం కలిగించింది. సింగరేణి జాగృతి టీబీజేకేఎస్ తో కలసి పనిచేస్తుందని కవిత చెపుతున్నప్పటికీ ఆచరణలో అది సాధ్యమయ్యే పని కాదని సింగరేణి కార్మిక సంఘాలు అంటున్నాయి.

సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెపుతున్నారు. నిన్న మంగళవారం సింగరేణి 11 ఏరియాలో కార్మికులతో కవిత హైదరాబాద్ లోని తన నివాసంలో భేటీ అయ్యారు.ఈ సమావేశంలో ఆమె సింగరేణి జాగృతి కార్మిక సంఘాన్ని స్ధాపించినట్లు ప్రకటించారు. ఈ సంస్ధ టీబీజేకేఎస్ తో కలసి పని చేస్తుందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులు విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి సింగరేణి జాగృతి కృషి చేస్తుందన్నారు. 11 ఏరియాలకు సింగరేణి జాగృతి కో ఆర్డినేటర్లను కూడా కవిత వెంటనే నియమించేశారు.

సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడానికి కవిత సన్నద్ధమవుతున్నారు. రాజకీయ పార్టీలకు సింగరేణి అంటే తమ ప్రయోజనాలు మాత్రమేనని కానీ కార్మికులకు ఆ సంస్థే జీవితమని అంటున్న కవిత వారందరి తరుపున తాము పని చేస్తామంటున్నారు. స్వయంగా బొగ్గు గనులు, ఓపెన్ కాస్టులను విజిట్ చేయడినికి కవిత ప్లాన్ చేసుకుంటున్నారు. సింగరేణి జాగృతికి అనుబంధంగా మహిళా విభాగం కూడా ఏర్పాటు చేస్తామని కూడా కవిత ప్రకటించారు. అయితే కవిత ఏ ఉద్దేశంతో సింగరేణి జాగృతి కార్మిక సంఘాన్ని స్ధాపించినా ఆమె అడుగులు రాజకీయ పార్టీ స్ధాపనవైపే నడుస్తున్నాయని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు. వాస్తవానికి సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక విభాగం ఉన్నప్పటికీ కవిత వేరు కుంపటి పెట్టి ఆ కార్మిక సంఘం బీఆర్ఎస్ కార్మిక సంఘంతో కలసి పనిచేస్తుందని చెప్పడం కేవలం కంటితుడుపు చర్యే అంటున్నారు రాజీయ పరిశీలకులు.

Politent News Web 1

Politent News Web 1

Next Story