Telangana Dgp Jitendar : తెలంగాణలో త్వరలో టూరిస్ట్ పోలీస్
డిజిపి డాక్టర్ జితేందర్ ఐపిఎస్ వెల్లడి

తెలంగాణ రాష్ట్రంలో టూరిస్టుల భద్రత కోసం త్వరలో టూరిస్ట్ పోలీసులను కేటాయించనట్టు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ వెల్లడించారు. తెలంగాణ టూరిజం శాఖ మరియు పోలీస్ శాఖ ల మధ్య సమన్వయ సమావేశం బుధవారం నాడు డిజిపి కార్యాలయంలో జరిగింది. టూరిజం శాఖ స్పెషల్ సీఎస్ శ్రీ జయేష్ రంజన్, శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ , టూరిజం శాఖ ఎం.డి వి.క్రాంతి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎం.డి సిహెచ్ .ప్రియాంక, ఇతర పోలీసు అధికారులు ఈ సమన్వయ సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.... తొలి దశలో టూరిజం శాఖకు అవసరమైన 80 మంది పోలీసు సిబ్బందిని త్వరలో కేటాయిస్తామని తెలియజేశారు. సెప్టెంబర్ 27వ తేదీన జరగనున్న వరల్డ్ టూరిజం డే సందర్భంగా టూరిస్ట్ పోలీసుల వ్యవస్థ సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాలైన అనంతగిరి, సోమశిల, రామప్ప, యాదగిరిగుట్ట, పోచంపల్లి, నాగార్జునసాగర్ ,బుద్ధవనం, భద్రాచలం, అమ్రాబాద్ తదితర ప్రాంతాలలో టూరిస్ట్ పోలీసులు పని చేస్తారని అన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందేందుకు పోలీస్ శాఖ పర్యాటక శాఖకు పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. షూటింగ్ పర్మిషన్లు కోసం, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం పర్యాటక శాఖ విధి విధానాలను రూపొందించాలని డిజిపి సూచించారు. తద్వారా ఆయా కార్యక్రమాలకు భద్రత కల్పించడం పోలీస్ సిబ్బందికి సులభం అవుతుందని తెలిపారు. ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం సినీ నిర్మతలు ముందుగా తెలియజేస్తే కార్యక్రమాలకు భద్రత కల్పించే సమయం దొరుకుతుందన్నారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ శ్రీ జయేష్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలను చేపట్టనునట్లు తెలిపారు. విదేశీ టూరిస్టులతో పాటు పాటు దేశంలో ఉన్న టూరిస్టులు విస్తృతంగా పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారని వారికి భద్రత కల్పించేందుకు టూరిస్ట్ పోలీసు అవసరం ఉందని తెలిపారు. ఆధ్యాత్మిక, మెడికల్, వినోదాత్మక పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే వారి భద్రత కోసం టూరిస్ట్ పోలీసులను కేటాయించాల్సి ఉందన్నారు. హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ శ్రీ విక్రమ్ సింగ్ మాన్, మల్టీ జోన్ _2 ఐజిపి శ్రీ తఫ్సీర్ ఇక్బాల్, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ శ్రీ గజరావు భూపాల్, రాచకొండ డిసిపి శ్రీమతి ఇందిర, ఏఐజి శ్రీ రమణ కుమార్, తదితరులు సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు.
