హైదరాబాద్ లో మరో రెండు ఫ్లై ఓవర్లు
Two more flyovers in Hyderabad

తెలంగాణలోని రేవంత్ సర్కార్ హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. భాగ్యనగరంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని భావించిన రేవంత్ సర్కార్.. సుమారు 7 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో.. హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్ట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్లో భాగంగా దాదాపు రూ.1740 కోట్ల ఖర్చుతో.. ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, రోడ్డు డెవలప్మెంట్ పనుల కోసం జీహెచ్ఎంసీ.. ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఇక ఇప్పటికే నగరంలో పలు ఫ్లైఓవర్లు ప్రారంభం కాగా.. మరి కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా జీహెచ్ఎంసీ హైదరాబాదీలకు మరో శుభవార్త చెప్పింది.
నగరంలో రద్దీ ఉండే రెండు ప్రాంతాల్లో.. మరో రెండు ఫ్లై ఓవర్లు, ఒక అండర్పాస్ నిర్మాణ పనుల కోసం తాజాగా టెండర్లను ఆహ్వానించింది. ఈ మూడింటి నిర్మాణ పనులకు.. ఒకే ప్యాకేజీ కింద టెండర్లు ఆహ్వానించింది. వీటి నిర్మాణానికి సుమారు రూ.368 కోట్లుగా జీహెచ్ఎంసీ అంచనా వేసింది. వీటికి జూన్ 18న టెండర్లు సమర్పించడానికి చివరి తేదీగా అధికారులు ప్రకటించారు. ఈ మూడింటి నిర్మాణంతో.. హైసిటీ పనుల్లో మరో అడుగు ముందుకు పడినట్లయింది.జీహెచ్ఎంసీ తాజాగా నిర్మించదలిచిన రెండు ఫ్లైఓవర్ల విషయానికి వస్తే.. ఒకటి బంజారాహిల్స్ ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ నుంచి జీవీకే మాల్ రోడ్డు వైపు రెండు లేన్లతో కాగా.. మరోకటి జంక్షన్ వద్ద 2 లేన్ల అండర్పాస్, 3 లేన్లతో ఫ్లై ఓవర్ నిర్మించనుంది. ఇప్పుడు ఈ పనులకు జీహెచ్ఎంసీ టెండర్లు ఆహ్వానించింది.
ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్ద నిర్మించ తలపెట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 మీదుగా అటు నుంచి జీవీకే మాల్వైపు కొనసాగుతంది. రెండు లేన్లతో ఒక అండర్పాస్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళిలకు రచిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే.. ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీ రూట్లో వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉండనుంది. పది మీటర్ల వెడల్పుతో ఈ అండర్పాస్ నిర్మించనున్నారు. అంతేకాక ఇక్కడ ఫుట్పాత్లతోపాటు రెండు లక్షల నీటి సామర్ధ్యంతో భూగర్భ సంప్ నిర్మాణం కూడా చేపట్టనున్నారు.బంజారాహిల్స్ ముగ్ధ జంక్షన్ నుంచి మీదుగా ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వైపు 3 లేన్లతో దీన్ని నిర్మించనున్నారు. ఈ ఫ్లైఓవర్ వెడల్పు 12 మీటర్లుగా ఉండనుంది. ఈ ప్యాకేజీలో నిర్మాణం చేపట్టబోయే ఈ ఫ్లైఓవర్లు ప్రయాణ మార్గం ఒకే దిశగా సాగనుంది. ఇవి అందుబాటులోకి వస్తే.. ఈ రద్దీ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరతాయంటున్నారు.ఈ పనుల ప్రారంభం కోసం జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. దీనిలో ఎంపికయ్యే ఏజెన్సీయే.. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించిన సర్వే, డిజైన్తో సహ మొత్తం పనులు చేయాల్సి ఉంటుంది. రెండేళ్ల వరకు ఏవైనా మరమ్మతులు అవసరమైతే చేయాల్సి ఉంటుంది.
