Uber Expands Centre of Excellence in Hyderabad: గ్లోబల్ మొబిలిటీ దిగ్గజం ఉబర్ తన హైదరాబాద్‌ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను మరింత విస్తరించనుంది. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్‌గా ఇది ప్రత్యేకత సంతరించుకుంది. ప్రస్తుతం ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పని చేస్తున్నట్లు ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి తెలిపారు.

బుధవారం ఉబర్ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసిన ఖోస్రోషాహి, రాష్ట్రంలో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించే యోచనలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీసు నిర్మాణానికి ముందుకు వచ్చారు. రాష్ట్రంలో భవిష్యత్తులో మరిన్ని కార్యకలాపాలు విస్తరించాలని, దానికి ప్రభుత్వం సహకరించాలని సీఎంను కోరారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన నగరాల్లో తీవ్రమవుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ఉబర్ ప్రతినిధులకు సూచించారు. మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ ఛార్జింగ్ సౌకర్యాలతో కూడిన పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. సీఎం సూచనలపై అధ్యయనం చేసి ముందుకు వస్తామని ఉబర్ బృందం హామీ ఇచ్చింది.

ఫ్యూచర్ సిటీలో 30 వేల ఎకరాల్లో ప్రపంచ స్థాయి 500 కంపెనీలను ఆహ్వానిస్తున్నామని సీఎం తెలిపారు. గత డిసెంబర్‌లో నిర్వహించిన గ్లోబల్ సమిట్‌లో 100కి పైగా కంపెనీలు పాల్గొని పెట్టుబడులకు ముందుకు వచ్చాయని వివరించారు.

ఈ సమావేశంలో ఉబర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కన్నన్, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభుజీత్ సింగ్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నిప్పల్లి నాగ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ విస్తరణ, ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ ఆఫీసు ఏర్పాటు తెలంగాణలో ఐటీ, ఇన్నోవేషన్ రంగాలకు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని వర్గాలు భావిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story