V. Hanumantha Rao: వీహెచ్కు ప్రభుత్వ సలహాదారు పదవి.. కేబినెట్ హోదాతో నియామకం
కేబినెట్ హోదాతో నియామకం

V. Hanumantha Rao: తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. బీసీ సంక్షేమం మరియు అభివృద్ధి శాఖకు ప్రభుత్వ సలహాదారుగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
సలహాదారుగా నియమితులైన హనుమంతరావుకు కేబినెట్ హోదా కల్పించబడింది. ఆయనకు నెలకు గౌరవ వేతనం, అలాగే మంత్రులకు అందే ప్రోటోకాల్ సదుపాయాలు కూడా వర్తించనున్నాయి. ప్రభుత్వం కేటాయించే నివాసం, వాహన సౌకర్యాలు, ఇతర భత్యాలు కూడా ఈ పదవితో పాటు లభిస్తాయి.
తెలంగాణ రాజకీయాల్లో దీర్ఘకాలంగా సేవలందించిన హనుమంతరావుకు బీసీ వర్గాలపై మంచి పట్టున్నందున, ఆ వర్గాల అభివృద్ధికి ఆయన అనుభవాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నియామకం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇకపై బీసీ సంక్షేమానికి సంబంధించిన విధానాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని భావిస్తున్నారు.
ఈ నియామకం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

