బనకచర్ల ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తున్నాం
తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అందులోభాగంగా ఈ ప్రాజెక్ట్ను అడ్డుకునేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకు వెళ్లి.. మాట్లాడామన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మించకుండా అడ్డుకోవాలని ఆయన్ని కోరామని చెప్పారు. అలాగే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అభ్యంతరాలపై ఇప్పటికే కేంద్రానికి తెలియజేశామన్నారు. ఆ క్రమంలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్ర జల్శక్తి మంత్రికి లేఖలు రాసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.గోదావరి నదికి వరద పోటెత్తే క్రమంలో నీరు సముద్రం పాలవుతుంది. ఈ నేపథ్యంలో ఆ నీటిని ప్రజా ప్రయోజనాల కోసం మళ్లించాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగా బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా ఆ వరద నీటిని రాయలసీమతోపాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించాలని భావించింది. తద్వారా తాగు, సాగు నీటి అవసరాలు తీర్చవచ్చని చెప్పింది. ఆ క్రమంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రంతో ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. అలాగే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల కలిగే లాభాలను సైతం కేంద్రానికి లేఖ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు
