- నెక్స్ట్ ప్లాన్ పై కేసీఆర్ దృష్టి.
- బనకచర్ల వివాదంపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం.
- త్వరలో నీటిపారుదల ప్రాజెక్టులపై బిఆర్ఎస్ కీలక సమావేశం.
- మహాధర్నాలకు రూపకల్పన.
- జిల్లాల పర్యటనల బాధ్యత కేటీఆర్ హరీష్ లకు.
బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలావరకు ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్ ఏప్రిల్ మాసంలో జరిగిన బిఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత పెద్దగా ఎక్కడా బహిరంగ వేదికలో గానీ పెద్ద సభల్లో గాని కేసీఆర్ పాల్గొనలేదు. అయితే తాజాగా రాజకీయంగా ప్రజల్లోకి మరింత చేరువైనందుకు బిఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా మరోసారి సెంటిమెంట్ అంశాన్ని వాడుకోవచ్చని అభిప్రాయంతో బిఆర్ఎస్ ఉంది. తెలంగాణలో అవునన్నా కాదన్నా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరుగుతుందంటే ప్రజల్లో కచ్చితంగా స్పందన వస్తుందని బిఆర్ఎస్ నేతలు అంటున్నారు.
వచ్చే నెలలో తెలంగాణ భవన్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కీలక సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు అదే విధంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. పార్టీ అధినేత కేసిఆర్ ఈ భేటీకి హాజరుకానున్నారు. కాలేశ్వరం విషయంలో ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారు తప్ప ప్రాజెక్టులను మరమ్మతులు చేయడం కానీ సకాలంలో నీటిని విడుదల చేసి రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది.
కాలేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు కూడా కేసీఆర్ హాజరయ్యారు. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని పదేపదే బిఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తోంది. ప్రాజెక్టులో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరి చేయాలి మరమ్మత్తులు చేయాలి కానీ మొత్తం ప్రాజెక్ట్ ని తప్పు పట్టడం సరైనది కాదని హరీష్ రావు లాంటి నేతలు పదేపదే అంటున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఏ అంశాలు అయితే టిఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయో ఇప్పుడు అలాంటి పరిస్థితిలే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నాయని కొందరి నేతల వాదన. కెసిఆర్ కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి పార్టీ నేతలకు డైరెక్షన్స్ ఇస్తున్నారు. త్వరలో పార్టీ కార్యాలయంలో జరిగే ఇరిగేషన్ ప్రాజెక్టుల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించడంతోపాటు అవసరమైతే మహా ధర్నాలు బంద్ వంటివి నిర్వహించాలని పార్టీ భావిస్తుంది. ఆగస్టులో ఈ కార్యచరణను అమలు చేయనున్నారు.
అయితే కేసీఆర్ పార్టీ సమావేశానికి మాత్రమే హాజరవుతారని మిగతా ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి పూర్తి బాధ్యతలను కేటీఆర్ హరీష్ రావులకు అప్పగించినట్లుగా తెలిసింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న ప్రచారం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై ప్రజలకు వివరించేందుకు త్వరలో జిల్లాల పర్యటన చేపట్టడానికి పార్టీ నేతలు కేటీఆర్ హరీష్ లు సిద్ధమవుతున్నారు. జిల్లాల వారీగా సమావేశాలు ఆందోళన కార్యక్రమాలకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లుగా నేతలు తెలిపారు.
