కవిత చెప్పింది కరెక్టే - మావాళ్లు అంతేనన్న రాజాసింగ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రియాక్ట్ అయ్యారు. కవిత చెప్పింది వాస్తవమే అని తాను నమ్ముతున్నానన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే మావాళ్లు కూడా బీఆర్ఎస్తో కలిసి పోతారని సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎక్కడెక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలో, బీఆర్ఎస్ వాళ్లే డిసైడ్ చేస్తారని, తమ బీజేపీ నేతలు కాదని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఇలాగే జరిగిందని రాజాసింగ్ గుర్తు చేశారు. అందుకే బీజేపీ తెలంగాణలో నష్టపోతోందన్నారు. వాస్తవానికి తెలంగాణలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందని, ఇప్పటివరకు ఎందుకు రాలేదో అందరూ ఆలోచించాలని సూచించారు. ప్రతి ఎన్నికల్లోనూ తమ వాళ్లు కుమ్మక్కయి పోతున్నారని, వీళ్ల వల్ల పార్టీ నష్టపోతోందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఈవిషయాలు తెలుసన్న రాజాసింగ్.. ఇది బయటకు చెబితే పార్టీ నుంచి సస్పెండ్ అవుతారని, అందుకే ఎవరూ బాహాటంగా చెప్పరని స్పష్టం చేశారు.
