బీఆర్‌ఎస్‌ పార్టీలో కవిత లేఖ లీక్‌ వివాదం తెలంగాణ రాజకీయాల్లోనే హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ లెటర్‌లో కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్‌ను బీజేపీపై సాఫ్ట్‌ కార్నర్‌గా ఉన్నారని, పార్టీ నాయకులకు అందుబాటులో ఉండటం లేదని, కీలక అంశాలపై మౌనం పాటిస్తున్నారంటూ పలు అంశాలపై విమర్శలు చేశారు. ఈ లేఖ బహిర్గతం కావడంతో బీఆర్‌ఎస్‌లో అసంతృప్తి, ఖండనలు, అనుమానాలు ఊపందుకున్నాయి. భారత రాష్ట్ర సమితిలో అంతర్గత సంక్షోభం తీవ్రమవుతున్న తరుణంలో, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఎన్నికల తర్వాత నుంచి అనుసరిస్తున్న మౌనమే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు.



మరోవైపు.. సోషల్‌ మీడియాలో పరస్పర భిన్న చర్చలు జరుగుతున్నాయి. కవితకు మద్దతుగా కొందరు ప్రచారం చేస్తుండగా, ఆమెకు వ్యతిరేకంగా కూడా మరికొందరు విశ్లేషణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ సైలెంట్‌గా ఉండటం పార్టీ భవిష్యత్తుపై సందేహాలను రేకెత్తిస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్‌కు.. మే 2వ తేదీన రాసిన ఆరు పేజీల లేఖ ఇటీవల ఆమె దేశంలో లేని సమయంలో బహిర్గతమైంది. ఆ లెటర్‌ ఒక్క బీఆర్‌ఎస్‌లోనే కాకుండా.. తెలంగాణ రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించింది. ప్రధానంగా ఏప్రిల్‌ 27వ తేదీన వరంగల్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ సభలో కేసీఆర్‌ ప్రసంగానికి సంబంధించి ఈ లేఖలో కవిత తనదైన విశ్లేషణ చేశారు. ఆ సభలో కేసీఆర్‌ ప్రసంగం అసలు పంచ్‌ లేకుండా ఉందని, భారతీయ జనతా పార్టీపై కేవలం రెండు నిమిషాలు మాత్రమే విమర్శలు చేశారని, ఇది బీజేపీతో తమ పార్టీ జట్టు కట్టబోతోందనే విమర్శలకు బలం చేకూరినట్లు అయ్యిందని కవిత తన లేఖలో పేర్కొన్నారు. అలాగే, 42% బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్‌ బిల్లు, ఉర్దూ భాషను కేసీఆర్‌ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం వంటి అంశాలపై విమర్శలు చేశారు. పార్టీ నాయకులు, క్యాడర్‌కు కేసీఆర్‌ అందుబాటులో ఉండటం లేదని, ఇది పార్టీలో అసంతృప్తిని పెంచుతోందని కూడా కవిత ఆందోళన వ్యక్తం చేశారు.



కేసీఆర్‌ కూతురుగా కవిత రాసిన ఈ లేఖ బీఆర్‌ఎస్‌లో అంతర్గత సమస్యలను బహిర్గతం చేసింది. ఆమె విమర్శలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు కాకుండా, పార్టీ క్యాడర్, నాయకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ప్రతిబింబిస్తాయని కూడా కవిత తన లేఖలోనే పేర్కొన్నారు. అయితే, గతంలో కూడా కేసీఆర్‌కు తాను ఇలాంటి లేఖలు రాశానని, ఇప్పుడు ఈ లేఖ లీక్‌ కావడం వెనుక పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారని కవిత ఆరోపించడం బీఆర్‌ఎస్‌లో కలకలం రేపింది. బీఆర్‌ఎస్‌లోనూ ఇన్నాళ్లు లేని అనుమానాల సంస్కృతిని స్టార్ట్‌ చేసింది. ఈ పరిణామం.. పార్టీలో నాయకత్వ సంక్షోభం, వారసత్వ రాజకీయాలపై చర్చను రేకెత్తించింది. కేసీఆర్‌ రాజకీయ జీవితంలో మౌనం ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉంది. గతంలో ప్రభుత్వ వ్యవహారాల్లో సమస్యలు తలెత్తినప్పుడు, ఆయన మౌనంగా ఉండి, సమయం గడిచిన తర్వాత నిర్ణయం తీసుకుని, అందరూ దాన్ని అంగీకరించేలా చేసేవారు. అయితే, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లోని అంతర్గత సంక్షోభం, కవిత లేఖ వివాదంలో ఈ మౌనం పనిచేస్తుందా అన్నది ప్రశ్న. కేసీఆర్‌ ఈ విషయంలో బహిరంగంగా స్పందించడం లేదు. పార్టీ నాయకులైన కేటీఆర్, హరీశ్‌రావులను కూడా స్పందించవద్దని సూచించారు. కవితను కలిసి మాట్లాడే విషయంలోనూ ఆయన తటపటాయిస్తున్నారని సమాచారం. కవిత విషయంలో కేసీఆర్‌ ''వేచి చూద్దాం'' వైఖరిని అవలంబిస్తే, అది పార్టీకి నష్టం కలిగించే పరిస్థితి ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ మౌనం బీఆర్‌ఎస్‌ను మరింత బలహీనపరచవచ్చని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.



ఇక, సోషల్‌ మీడియాలో కవితకు మద్దతుగా కొందరు ప్రచారం చేస్తుండగా, మరికొందరు ఆమెకు కేసీఆర్‌ కూతురిగా తప్ప సొంత గుర్తింపు లేదని, ఆమె సొంత పార్టీ పెడితే కార్పొరేటర్‌గా కూడా గెలవలేరని విమర్శిస్తున్నారు. కవిత లేఖ వెనుక ఆమె ఉద్దేశం పార్టీలో సంస్కరణలు తీసుకురావడమా> లేక నాయకత్వంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడమా? అన్నది స్పష్టంగా తెలియడం లేదంటున్నారు. ఆమె కేసీఆర్‌ నాయకత్వంపై విధేయతను ప్రదర్శించిన్పటికీ.. లేఖ వివాదం కవిత రాజకీయ భవిష్యత్తుపై కీలక పరిణామంగా ఉంటుందని చెబుతున్నారు. కొందరేమో కవిత సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందని అంటూండగా.. మరికొందరు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయవచ్చని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే రాజకీయంగా రాష్ట్రంలో అత్యంత బలహీనమైన స్థితిలో ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్‌ ఎన్నికల్లో సగం సీట్లలో డిపాజిట్‌ కోల్పోవడం ద్వారా పార్టీ గత వైభవాన్ని కోల్పోయింది. ఈ తరుణంలో కవిత లేఖ వివాదం పార్టీలోని అంతర్గత విభేదాలను మరింత బహిర్గతం చేసింది. కేటీఆర్‌ను పార్టీ వారసుడిగా సిద్ధం చేస్తున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. ఈ క్రమంలో కవిత సొంత పార్టీ పెడితే, అది బీఆర్‌ఎస్‌కు మరింత నష్టం కలిగించవచ్చంటున్నారు. ఆమె రాజకీయ ప్రభావం పరిమితంగా ఉన్నప్పటికీ, బీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో ఆమెకు కొంత మద్దతు ఉందని ఆమె అభిమానులు చెబుతున్నారు. ఈ విభేదాలు పార్టీని మరింత బలహీనపరిచి, కాంగ్రెస్, బీజేపీలకు ప్రయోజనం చేకూర్చవచ్చంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌కు కుటుంబం, పార్టీ మధ్య సమతుల్యత సాధించడం ఒక పెద్ద సవాలుగా మారింది. కేసీఆర్‌ మౌన వ్యూహం ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైతే, బీఆర్‌ఎస్‌ మరింత పతనం దిశగా ప్రయాణించవచ్చన్న విశ్లేషణలు సాగుతున్నాయి.




Politent News Web4

Politent News Web4

Next Story