కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ సాగిస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. ఈ విచారణకు కేసీఆర్‌ హాజరు అవుతారా? లేదా? అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్‌ విచారణకు హాజరు కావడంపై పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారని చెబుతున్నారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నోటీసుల ప్రకారం.. కమిషన్‌ ముందుకు విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 5వ తేదీన కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై బీఆర్‌ఎస్‌ పార్టీలోని సీనియర్ నేతలకు కేసీఆర్ సంకేతం ఇచ్చారని చెబుతున్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ ఇప్పటికే యేడాదికి పైగా విచారణలో భాగంగా అనేక కోణాల్లో పలువురిని ప్రశ్నించింది. తాజాగా.. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావులకు నోటీసులు ఇచ్చింది. అయితే, కేసీఆర్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడంతో.. హరీశ్ రావు కూడా ఎంక్వైరీ కమిషన్‌ ఎదుట హాజరు కానున్నారు. కమిషన్ ఎదుట హాజరయి ప్రశ్నలకు నేరుగా కేసీఆర్ సమాధానం చెప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది.

జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో నియామకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కమిషన్ విచారణ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఈ సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 5వ తేదీన కేసీఆర్, జూన్ 6వ తేదీన ఈటల రాజేందర్, చివరగా జూన్ 9వ తేదీన హరీష్ రావు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసు అందుకున్నప్పటి నుంచి కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కావాలా, వద్దా? అనే అంశంపై తర్జనభర్జన జరిగింది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో చాలాసార్లు దీనిపై చర్చించారు. పార్టీ ముఖ్యులతో పాటు న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరిపి సలహాలు తీసుకున్నారు. గతంలో విద్యుత్ కొనుగోళ్లపై వేసిన కమిషన్‌పై నోటీసు అందుకున్న కేసీఆర్ చాలా తీవ్రంగా ప్రతిస్పందించారు. కమిషన్‌కు లేఖ రాస్తూ కమిషన్ ఏర్పాటు, కమిషన్‌ చైర్మన్‌గా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి అక్కడ కొనసాగడం తప్పంటూ తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు మాత్రం ఆ పంథాలో వెళ్లకూడదని భావిస్తున్నట్లు తెలిసింది.

వాస్తవానికి గతేడాది అసెంబ్లీలో కాళేశ్వరంపై కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకోండి అంటూ సవాల్ విసిరిందే బీఆర్ఎస్. తీరా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన తర్వాత హాజరు కాకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, కమిషన్‌ను గౌరవించకపోతే అది బీఆర్ఎస్‌కు ప్రతికూలత అవుతుందని భావిస్తున్నారు. హాజరైతే ప్రజల్లో సింపతీ కూడా పెరుగుతుందని, ప్రభుత్వం కావాలనే కక్ష గట్టి విచారణలకు తిప్పుతుందని సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. మొత్తానికి మొదటిసారిగా ఓ విచారణకు గులాబీ దళపతి హాజరవుతారని తెలుస్తోంది. మరోవైపు.. బీఆర్‌ఎస్‌లో గంభీర వాతావరణం కనిపిస్తోంది. జూన్ 5 బిగ్ డే అంటూ చర్చించుకుంటున్నారు కార్యకర్తలు. ఇక కాళేశ్వరంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇప్పటికే 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది. గత ప్రభుత్వ హయాంలో కీలక పోస్టులను డీల్‌ చేసిన అధికారులు సోమేష్‌కుమార్‌, స్మిత సబర్వాల్‌, రజత్‌కుమార్‌ వంటి వారిని బహిరంగ విచారణకు పిలిచింది. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు, కాళేశ్వరంగా రూపాంతరం చెందడం మొదలు, ప్రాజెక్టు డిజైన్‌లు, అనుమతులు, నిధులకు సంబంధించిన కీలక సమాచారాన్ని రికార్డు చేసింది. ముఖ్య ప్రాజెక్టు వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచడంపై ఆరా తీసింది. నిర్మాణం పూర్తి కాకుండానే బకాయిల చెల్లింపుపై కూడా కూపీ లాగింది.ఈ సమాచారాన్ని క్రోడికరించిన పీసీ ఘోష్‌ కమిషన్‌.. గత ప్రభుత్వ హయాంలో కీలక నిర్ణయాలు తీసుకున్న పెద్దలను ప్రశ్నించాలని నిర్ణయించింది. ఆ క్రమంలోనే నోటీసులు జారీ అయ్యాయి. ఇక, మాజీ సీఎం కేసీఆర్‌, అప్పటి మంత్రులు హరీష్‌రావు, ఈటల విచారణకు సంబంధించి ఇప్పటికే ప్రశ్నల చిట్టా సిద్ధమైందా? టెక్నికల్‌ అంశాలతో పాటు నిధుల వ్యవహారంపై కూడా కమిషన్‌ ప్రధానంగా ఫోకస్‌ చేసిందా? నోటీసులపై బీఆర్‌ ఎస్‌, ముఖ్యంగా కేసీఆర్‌ స్ట్రాటెజీ ఎలా వుండబోతుందన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.



Politent News Web4

Politent News Web4

Next Story