ఇండియాలోనే ఉండిపోవాలనిపిస్తోంది – మిస్ ట్యునీషియా లామిస్
"ఇది కలలాగా ఉంది. నాకు ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తోంది" అని మిస్ ట్యునీషియా లామిస్ చెబుతోంది. మిస్ వరల్డ్ కాంటెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చిన ఈ ట్యునీషియా అందగత్తె తన భారతీయ అనుభవాన్ని పొలిటెంట్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. పొలిటెంట్ న్యూస్కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించింది.
ఇక్కడి మనుషులు ఎంతో ప్రేమగా, స్నేహంగా తమతో వ్యవహరిస్తున్నారని, ఇక్కడ తనకు స్వదేశంలో ఉన్నట్టే అనిపిస్తోందని చెప్పింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భోజనం, సౌందర్యం అన్నీ కలసి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తున్నాయని లామిస్ తెలిపింది. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లినప్పుడు తన కళ్లను తానే నమ్మలేక పోయానని, అసలు ఇదంతా నిజమేనా? అని కాసేపు అనిపించిందని, కలల ప్రపంచంలో ఉన్నట్టు అనిపించిందని వెల్లడించింది. డ్రోన్ షో కూడా అద్భుతంగా సాగిందని లామిస్ తెలిపింది.
భారతీయ సినిమా గురించి తమ దేశంలో కూడా చాలా తెలుసునని, అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత, పూర్తిగా తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతోందని చెప్పింది. ఇకపై తాను హిందీ, తెలుగు సినిమాలు చూడబోతున్నానని చెప్పిన లామిస్.. తెలంగాణ జరూర్ ఆనా అనే హిందీ పదాన్ని కూడా నేర్చుకున్నట్లు తెలిపింది.
తాము ట్యునీషియాలో కూడా మసాలా ఎక్కువగా వాడతామని, హైదరాబాద్ భోజనం బాగా నచ్చిందని, ప్రత్యేకించి తెల్లటి స్వీట్.. దాని పేరు తెలియదు కానీ చాలా బాగా నచ్చిందని లామిస్ చెప్పింది. తనకు ఇండియా మొత్తం చూడాలని ఉందని, ప్రతి ప్రాంతం ఒక జ్ఞాపకంగా మన హృదయంలో నిలిచిపోతుందని, ఇది జీవితంలో ఒక్కసారి కలిగే అనుభవం అని భావోద్వేగంతో చెప్పింది.
తాను చిన్నప్పటినుంచి కరాటే ప్రాక్టీస్ చేస్తున్నానని, ఆటల్లో ఓటములు ఎదురైనా అవే తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయని, ఇప్పుడు మిస్ వరల్డ్ టాలెంట్ రౌండ్లో మళ్లీ కరాటే ప్రదర్శన ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని మిస్ ట్యునీషియా తన మనసులో మాట చెప్పింది.
