Airport closures in West Asia – thousands of travelers at risk of migration

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పశ్చిమాసియా మొత్తం గగనతల భద్రత కఠినంగా మారింది. ఇజ్రాయెల్‌ చేపట్టిన భారీ క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్‌ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేయడంతో పాటు లెబనాన్‌, జోర్డాన్‌, ఇరాక్‌ వంటి దేశాల్లోనూ విమాన రాకపోకలు నిలిచిపోయాయి.



ఈ నిర్ణయాల వల్ల పశ్చిమాసియా వ్యాప్తంగా అనేక ఎయిర్‌పోర్టులు మూతపడ్డాయి. దాంతో అక్కడ ప్రయాణాలకు వచ్చి చిక్కుకుపోయిన వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిటైర్డ్ పైలట్, విమానయాన భద్రతా నిపుణుడు జాన్ కాక్స్ తెలిపిన వివరాల ప్రకారం, దాదాపు 10,000 మందికి పైగా ప్రయాణికులు ఇరాన్ సహా పలు దేశాల్లో నిలిచిపోయారు.



టెహ్రాన్ శివార్లలోని ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయం శుక్రవారం నుంచే విమాన సేవలు నిలిపివేసింది. శనివారం టెహ్రాన్‌లోని మెహ్రాబాద్‌ విమానాశ్రయంపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులకు దిగిందని అధికారులు వెల్లడించారు. అదే విధంగా, ఇజ్రాయెల్‌ బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా మూసివేసింది. దీని ఫలితంగా 50,000 మందికి పైగా ఇజ్రాయెల్‌ పౌరులు విదేశాల్లో చిక్కుకుపోయారు.



ఇరాన్‌ పౌర విమానయాన సంస్థలు తమ విమానాలను లార్నాకా తరలించగా, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు జోర్డాన్‌, ఈజిప్ట్‌ సరిహద్దుల నుంచి ఎవరు దేశం విడిచిపోవద్దని ఆదేశించారు. ఆ మార్గాల్లో ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరించారు. లెబనాన్‌, జోర్డాన్‌లలో గగనతలం పాక్షికంగా అందుబాటులో ఉన్నప్పటికీ, విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అనేక విమానాలు రద్దుకావడంతో వేలాది మంది ప్రయాణికులు, పౌరులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.



ఇరాన్‌లోని భారతీయుల కోసం కూడా భారత ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. టెహ్రాన్‌లో ఉన్న భారతీయులలో మొదటి బ్యాచ్‌ను ఇప్పటికే తరలించారు. సమాచారం ప్రకారం, ప్రస్తుతం అక్కడ సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో సుమారు 6,000 మంది విద్యార్థులుగా గుర్తించారు.



గగనతల పరిమితుల కారణంగా వారిని భూసరిహద్దుల ద్వారా భారత్‌కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ఆర్మేనియా, అజర్‌బైజాన్‌, తుర్కమెనిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ మీదుగా రవాణా మార్గాలు సిద్ధం చేస్తున్నట్లు ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది.


Politent News Web4

Politent News Web4

Next Story