చీర కట్టుకుంటే భారతీయ రాజకుమారిలా అనిపించింంది - మిస్ నైజీరియా
తాను భారతీయ సంప్రదాయంలో భాగమైన చీర కట్టుకొని పర్యటనకు వెళ్లిన రోజు భారతీయ రాజకుమారిలా ఫీలయ్యానని భావోద్వేగానికి గురయ్యారు మిస్ నైజీరియా జాయ్ మోజిసోలా రెయిమీ. మిస్ వరల్డ్ 2025 పోటీల కోసం హైదరాబాద్ వచ్చిన మిస్ నైజీరియా పొలిటెంట్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు చెప్పారు. తన జీవితంలో చీరకట్టు అదే మొదటిసారి అని చెప్పారు. చార్మినార్, చౌమహల్లా ప్యాలస్, ఆలయాలు దర్శించానని, ఇక్కడ తాను షాపింగ్లో భాగంగా ఒక్కటి మాత్రమే కొన్నానని, కానీ, పదేళ్ల దాకా గుర్తుండిపోయే బహుమతులు ఇక్కడి వాళ్లు ఇచ్చారని, తమపై ఇంతగా ప్రేమ చూపిస్తున్నారని మురిసిపోయారు.హైదరాబాద్లో అందిన ఆతిథ్యంపై ప్రశంసల వర్షం కురిపించారు.
నైజీరియాలో తాము భారతీయ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు ఎంతో ఇష్టంగా చూస్తామని, లవ్ స్టోరీస్, యాక్షన్ సినిమాలు అన్నీ బాగా నచ్చుతాయని చెప్పారు. తాను రోజూ చికెన్ బిర్యానీ తింటున్నానని, చికెన్ బిర్యాని తినడం మానలేక పోతున్నానని చెప్పారు మిస్ నైజీరియా.
మిస్ వరల్డ్ అనేది ఒక మారథాన్ లాంటిదని, ప్రతి రోజు స్పోర్ట్స్ ఛాలెంజ్, టాలెంట్, టాప్ మోడల్ లాంటి విభాగాల్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందని, ప్రతి రాత్రి తన గదిలోకి వెళ్లి, తరువాతి రోజుకోసం సిద్ధమవుతుంటానని చెప్పారు.తాను ఇండో ఆఫ్రో డ్యాన్స్ చేశానని, ఇది భారతీయ, ఆఫ్రికన్ డ్యాన్స్ల సమ్మిళితమని, తన టాలెంట్ సెక్షన్లో దీన్ని ప్రదర్శించానని, ఈ డ్యాన్స్ అందరూ చూడాలని కోరారు.
తాను అప్పుడప్పుడూ తెలుగు సినిమాలు చూస్తానంటూ.. రాను బొంబాయికి రాను.. అనే పాట పాడుతూ డ్యాన్స్ చేయడం పొలిటెండ్ న్యూస్ ఇంటర్వ్యూలో హైలైట్గా నిలిచింది.
