మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన తాను.. భారత్‌ నుంచి తిరిగి వెళ్లేలోగా మూడు కోరికలు ఉన్నాయని మిస్‌ వెనిజులా వాలేరియా తన మనసులోని కోరికను వెల్లడించింది. పొలిటెంట్‌ మీడియాకు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో వాలేరియా ఓపెన్‌గా తన భావాలు వెల్లడించింది. తాజ్ మహల్ చూడాలని ఉందని, మరోసారి ఏదైనా మార్కెట్‌కి వెళ్లి మరింత షాపింగ్ చేయాలని ఉందని, అలాగే, ఇక్కడి సంస్కృతిని ప్రతిబింబించే మరిన్ని సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించాలని ఉందని మిస్‌ వెనిజులా చెప్పింది. ఇప్పటికే రామప్ప ఆలయం, వెయ్యి స్తంభాల గుడిని చూశానని, అద్భుతంగా ఉన్నాయంది. భారత్ అంతా మాయతో నిండినదిగా ఉందని, ప్రతీ మూలాన్నీ అన్వేషించాలని కోరికగా ఉందని వాలేరియా చెప్పింది.

మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్‌ రావడం మరిచిపోలేని అనుభూతి అని, తెలంగాణ పర్యటన ఎంతగానో ఆస్వాదించానని తెలిపింది. చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్, లాడ్ బజార్‌ వంటి ప్రదేశాలను సందర్శించానని, లాడ్‌బజార్‌లో చుడిదార్‌లు కొన్నానని చెప్పింది. చౌమహల్లా ప్యాలెస్ చూసిన అనుభూతి మరిచిపోలేనిదని, ఒక పరిమళ కథలా అనిపించిందని వెల్లడించింది. చరిత్ర, సంస్కృతి పట్ల తనకు చాలా మక్కువ ఉందని, ఆసియా ఖండంలో తన మొదటి పర్యటన భారతదేశం అని.. అందులోనూ తెలంగాణలో పర్యటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. ఇక్కడి ప్రజలు ఎంతో ఆత్మీయంగా ఉన్నారని, తనకు అద్భుతమైన స్వాగతం లభించిందని పేర్కొంది.

తనకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టమని, తాను ఫ్యాషన్ డిజైనర్ కావడం వల్ల చీరలపై ప్రత్యేక ఆకర్షణ ఉందని వాలేరియా చెప్పింది. చీర ధరించడం నేర్చుకున్న సమయంలో తనకు ముచ్చటగా అనిపించిందని, కానీ.. ఒంటరిగా ధరించడంలో సహాయం అవసరమవుతుందని తెలిపింది. అలాంటి అనుభవాలన్నీ అద్భుతంగా ఉంటాయని పేర్కొంది.

భారతీయ సినిమాల పట్ల కూడా తనకు ఆసక్తి ఉందని, చిన్నతనంలోనే కొన్ని బాలీవుడ్ చిత్రాలు చూసిన అనుభవం ఉందని, ప్రియాంక చోప్రా తనకు ఎంతో ఇష్టమైన హీరోయిన్‌ అని పేర్కొంది. అయితే, తెలుగు సినిమాల గురించి తెలుసుకోవాలని, ఇప్పటికే కొన్ని సినిమాలు చూసినట్టు, మరిన్ని చూడాలని ఉందని చెప్పింది. “పుష్పా” సినిమా గురించి వాలేరియా ముందే తెలుసునని తెలిపింది. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ఒక బ్లాక్‌బస్టర్ అని, పాటలు కూడా ఎంతో ఫేమస్ అయ్యాయని పేర్కొంది.


Updated On 28 May 2025 3:03 PM IST
Politent News Web4

Politent News Web4

Next Story