జిలేబీ మళ్లీ మళ్లీ తినాలనిపిస్తోంది - మిస్ స్కాట్లాండ్
తాను హైదరాబాద్ వచ్చిన మొదటిరోజు తిన్న జిలేబీ మళ్లీ మళ్లీ తినాలనిపిస్తోందని మిస్ స్కాట్లాండ్ ఏమీ స్కాట్ చెప్పారు. అలాగే, తనకు దోస ఎలా తినాలో మిస్ ఇండియా నేర్పించారని చెప్పింది. తాను వెజిటేరియన్నని.. ఇక్కడి దాల్ చాలా రుచిగా ఉందన్నారు. దోస, ఇడ్లీ వంటి బ్రేక్ఫాస్ట్ ఐటెమ్స్ తనకెంతో నచ్చాయన్నారు.
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన మిస్ స్కాట్లాండ్ ఏమీ స్కాట్.. ఇదే తన మొదటి ఇండియా ట్రిప్ అన్నారు. ఇక్కడి సంస్కృతి, ఆతిథ్యం గురించి తన ఫ్రెండ్స్ చాలా బాగా చెప్పేవారని, ఇప్పుడు స్వయంగా అనుభవిస్తున్నానని భారత్ అద్భుతమైన దేశమని ఏమీ స్కాట్ తెలిపారు.
వారానికి మూడు సార్లు జిమ్కు వెళ్తానని, కార్డియో, స్ట్రెంథ్ వర్కౌట్స్ చేస్తానని మిస్ స్కాట్లాండ్ తెలిపారు. అంతేకాకుండా పిలేటిస్ క్లాసులు, గోల్ఫ్ వంటి యాక్టివిటీలతో తన ఫిట్నెస్ కాపాడుకుంటున్నానని వెల్లడించారు.
అనారోగ్యం కారణంగా చీర ధరించి వెళ్లాల్సిన టూర్ మిస్సయ్యానని, ఇది తనకెంతో బాధగా ఉందని, అయితే, చీర కట్టుకునే ప్రయత్నం మాత్రం చేస్తానని తెలిపారు. భారతీయ సినిమాల్లో ప్రియాంకా చోప్రా తనకెంతో ప్రేరణ ఇస్తుందన్నారు. ఏమీ జాక్సన్ తన ఫేవరెట్ యాక్ట్రెస్ అని, బాలీవుడ్, వెస్ట్రన్ సినిమాల కలయికలో నటించడం గొప్ప విషయమన్నారు. తెలుగు సినిమాలు చూడలేకపోయినప్పటికీ, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోలలో ఒకటి కావడం గొప్ప విషయమన్నారు. తనకు ఆర్ట్, ఫ్యాషన్ డిజైన్ మీద మక్కువ ఉందని, ఈ టూర్ కోసం ఒక డ్రెస్సు తానే డిజైన్ చేశానని తెలిపారు.
