Miss World beauties dance with children
హైదరాబాద్లో మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొన్న అంతర్జాతీయ అందగత్తెలు... చిన్నారుల కోసం నిర్వహించిన ప్రత్యేక చారిటీ కార్యక్రమంలో పాల్గొని వారి హృదయాలను గెలుచుకున్నారు. ఒకవైపు ఆటపాటలతో పిల్లల ముఖాల్లో చిరునవ్వులు పుట్టిస్తూనే.. మరోవైపు భావోద్వేగభరిత సందేశాలతో వారిని ఆకట్టుకున్నారు.
పోటీలో పాల్గొన్న ఓ అందగత్తె మాట్లాడుతూ.. “మీకింకా చిరునవ్వు రావడం లేదు... నవ్వండి! మీకు ఒక విషయం చెబుతాను... మీరు అనాథలు కాదు. మేమంతా మీ కుటుంబమే. మిస్ వరల్డ్ అనే ఈ ప్రపంచం మీకోసం ఉంది. మీరు ఒంటరిగా ఉన్నారని భావించే ఏ క్షణానైనా.. ఈ ప్రపంచమే మీ కుటుంబమని గుర్తుంచుకోండి,” అని హత్తుకునేలా చెప్పారు. తాను కూడా మీలాంటి చిన్నపిల్లగానే పెరిగానని, కానీ తనకు ఏదైనా సాధించగలననే నమ్మకమే ఇక్కడిదాకా తీసుకొచ్చిందని చెప్పారు.
నైజీరియా నుంచి వచ్చిన మరో అందగత్తె మాట్లాడుతూ.. తాను చిన్నవయసులోనే తల్లిని కోల్పోయానని.. ఆ పరిణామం అది ఎంత బాధ కలిగించేదో తనకు తెలుసన్నారు. పెంపుడుతల్లి పెంపకంలో పెరిగిన తాను.. ఇవాళ ప్రపంచ వేదికపై నైజీరియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని గర్వంగా చెప్పారు. ఎందుకంటే... తన భవిష్యత్తు ఎవరూ నిర్ణయించలేరని, తన కలలు నిజమవుతాయన్న తన నమ్మకమే ఇక్కడిదాకా తీసుకొచ్చిందని ఉద్వేగభరితంగా చెప్పారు.
అందగత్తెల్లో మరో యువతి మాట్లాడుతూ.. తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, భవిష్యత్తులో తల్లిగా మారాలనే కోరిక కూడా ఉందని, ఇంతమందిని చూసి, వారి ముఖాల్లో చిరునవ్వులు చూసిన ఈ రోజు తనజీవితంలో ఒక ప్రత్యేక క్షణంగా మిగిలిపోతుందని వెల్లడించారు.
ఇక్కడున్న చిన్నారుల ఎనర్జీ, ప్రేమ… అన్నీ తనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని, తెలంగాణలో గడిపిన ఈ రోజును తాను జీవితాంతం మర్చిపోలేనని మరో కాంటెస్టెంట్ తెలిపారు.
అయితే, అందగత్తెలు కేవలం మాటలు, ప్రసంగాలకే పరిమితం కాలేదు. వాళ్లంతా అక్కడున్న పిల్లలతో కలిసి ఆటలు ఆడారు. డ్యాన్స్లు చేశారు. నవ్వించారు, ఆడించారు.

