టెహ్రాన్లో మొస్సాద్ డ్రోన్ ఫ్యాక్టరీ ధ్వంసం
Mossad drone factory destroyed in Tehran

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా వణికిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా టెహ్రాన్లోని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్కు చెందిన డ్రోన్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసినట్లు ఇరాన్ వెల్లడించింది.
ఈ డ్రోన్ ఫ్యాక్టరీలో విస్ఫోటక పదార్థాలతో నిండిన చిన్న డ్రోన్లను తయారుచేస్తూ, పలు కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఇరాన్ ఆరోపించింది. ఈ క్రమంలో ఇరాన్ అధికారులు మొస్సాద్ తరఫున పనిచేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 200 కిలోలకుపైగా పేలుడు పదార్థాలు, 23 డ్రోన్ల భాగాలు, లాంచర్లు, ఇతర సాంకేతిక పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు టెహ్రాన్ అధికారులు తెలిపారు.
అంతేకాకుండా, మొస్సాద్కు ఏజెంట్గా పనిచేస్తున్న ఇస్మాయిల్ ఫెక్రీ అనే వ్యక్తికి ఉరి శిక్షను అమలు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇక ఈ నెల 13వ తేదీ నుంచి ఇజ్రాయెల్ ప్రారంభించిన వైమానిక దాడుల నేపథ్యంలో ఇరుదేశాలు పరస్పరం క్షిపణి దాడులకు దిగుతున్నాయి. టెల్ అవీవ్ జరిపిన దాడుల్లో ఇరాన్కి కీలక నేతల్ని కోల్పోయిన అనంతరం, టెహ్రాన్ ప్రతీకార చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్ పౌర నివాసాలపై క్షిపణి దాడులు ప్రారంభించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా దాడులు తీవ్రతరం చేసింది.
తాజాగా ఇరాన్ అధికారిక టీవీ భవనంపై సోమవారం క్షిపణి దాడి జరగడం కలకలం రేపింది. స్టూడియోలో న్యూస్ రీడర్ ప్రత్యక్ష ప్రసారంలో వార్తలు చదువుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని లైవ్లో దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. ఇదే సమయంలో ఇరాన్ ప్రయోగించిన మరో క్షిపణి టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయంలోకి దూసుకెళ్లింది. ఈ క్షిపణి ఈ దాడిలో స్వల్ప నష్టం వాటిల్లినప్పటికీ సిబ్బంది ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియా ప్రస్తుతం ఉద్రిక్తతలతో రగిలిపోతోంది. దీంతో, యుద్ధం మరింత విస్తరించే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
