ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ ప్రయోగించిన మెగా రాకెట్‌ మరోసారి విఫలమైంది. గాలిలోనే పేలిపోయింది. దీంతో, అంతరిక్ష రంగంపై పట్టు పెంచుకోవాలని చూస్తోన్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. సుదూర అంతరిక్ష జర్నీల కోసం స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ రూపొందించిన స్టార్‌షిప్‌ మెగా రాకెట్‌ పేలిపోయింది. మొదట ఈ రాకెట్‌ నింగిలోకి సక్సెస్‌ఫుల్‌ గానే దూసుకెళ్లినప్పటికీ.. దాదాపు అరగంట తర్వాత అంతరిక్షంలో పేలిపోయింది. స్టార్‌షిప్‌ రాకెట్‌ ఇలా గాలిలోనే పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి.

అమెరికా టైమ్‌ ప్రకారం.. మంగళవారం రాత్రి 7.36 గంటలకు టెక్సాస్‌ లోని బ్రౌన్స్‌విల్‌ తీరంలోని లాంచ్‌ప్యాడ్‌ నుంచి స్పేస్‌ఎక్స్ ఈ మెగా రాకెట్‌ను ప్రయోగించింది. పునర్వినియోగం కోసం డెవలప్‌ చేసిన 123 మీటర్ల పొడవైన ఈ భారీ రాకెట్‌ నింగిలోకి తొలిదశలో సజావుగానే దూసుకెళ్లింది. అయితే, కొన్ని నిమిషాల తర్వాత బూస్టర్‌ ఈ రాకెట్‌ నుంచి విడిపోయి భూమి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. కానీ, స్పేస్‌ఎక్స్‌ కంట్రోలర్స్‌కు బూస్టర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రణాళిక ప్రకారం.. నియంత్రిత్వ రీతిలో భూమిని తాకకుండా.. సముద్రంలో పడిపోయింది.

మరోవైపు.. స్టార్‌షిప్‌ మాత్రం తన జర్నీని ముందుకే కొనసాగించి.. అంతరిక్షం చేరుకుంది. కానీ, నిర్ణీత కక్ష్యలోకి చేరుకున్న తర్వాత స్టార్‌షిప్‌ పేలోడ్‌లోని శాటిలైట్లను ప్రవేశపెట్టేందుకు వీలుగా తలుపులు తెరుచుకోలేదు. దాదాపు అరగంట తర్వాత స్టార్‌షిప్‌ కూడా నియంత్రణ కోల్పోయింది. గింగిరాలు తిరుగుతూ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. కాసేపటికే హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది. దీనిపై స్పేస్‌ ఎక్స్‌ సంస్థ రియాక్ట్‌ అయ్యింది. ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటామని స్పష్టం చేసింది.

కాగా.. స్టార్‌షిప్‌ మెగా రాకెట్‌ పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి. ఈ ఏడాది జనవరిలో, మార్చిలో రెండుసార్లు చేపట్టిన ప్రయోగాల్లోనూ ఈ భారీ రాకెట్లు గాల్లోనే పేలిపోయాయి. అయితే, గత రెండు సార్ల కంటే ఈ దఫా రాకెట్‌ ఎక్కువ దూరం ప్రయాణించిందని స్పేస్ ‌ఎక్స్‌ వెల్లడించింది.


Politent News Web4

Politent News Web4

Next Story