స్పేస్ ఎక్స్ రాకెట్ తో భారత వ్యోమోగామి శుభాంశు శుక్లా
Subhanshu Shukla to pilot SpaceX's international space mission

అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ మరో అంతరిక్ష యాత్రకు సిద్దమైంది. ‘యాక్సియమ్’ చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్కు రంగం సిద్దమైంది. రేపు (మంగళవారం) భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నింగిలోకి దూసుకెళ్లనున్నారు. స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. దీంతో రోదసి యాత్ర చేపట్టిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇంతకుముందు రాకేశ్ శర్మ రష్యా సహకారంతో అంతరిక్షయానం చేయగా ఇప్పుడు ఆ ఘనత శుభాంశు శుక్లాకు దక్కుతుంది.
భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:52 గంటలకు అంతరిక్ష యాత్ర ప్రారంభం కానుంది. అమెరికా ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం జరగనుంది. భారత్, పోలండ్, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమవుతున్నారు. మిషన్కు శుభాన్షు శుక్లా పైలట్గా వ్యవహరించబోతున్నారు.
భారత్కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు కు అవకాశం వచ్చింది. ‘స్పేస్ఎక్స్’ సంస్థకు చెందిన ‘డ్రాగన్’ వ్యోమనౌక ద్వారా శుభాంశు శుక్లా ఐఎస్ఎస్కు చేరుకుంటారు. ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుక్లా చరిత్రకెక్కుతారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు.
నిజానికి మే 29నే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. తొలుత ఈ ప్రయోగాన్ని జూన్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత రేపటికి వాయిదా పడింది. ప్రయోగానికి ముందు సన్నాహాల్లో గుర్తించిన చిన్న సాంకేతిక సమస్య కారణంగా మిషన్ వాయిదా వేసినట్లు అమెరికాకు చెందిన వాణిజ్య మానవ సహిత అంతరిక్షయాణ సంస్థ యాక్సియమ్ స్పేస్, నాసా సంయుక్తంగా ప్రకటించాయి.
