పాపం పాక్.. గాడిదలు కూడా దొరకడం లేదు!!

- పాక్ గాడిదలకు గడ్డు కాలం !!
- పాకిస్థాన్ లో విచిత్ర పరిస్థితులు
- ఇప్పటికే తిండి గింజలు కరువు.. ఆకాశాన్నంటుతున్న రేట్లు
- పాక్ గాడిదలను ఎగరేసుకుపోతున్న చైనా
- గాడిద చర్మం, కొవ్వుతో ఔషధాల తయారీ
- ఎజియావో ఔషధానికి చైనాలో కొన్ని కోట్ల టర్నోవర్ వ్యాపారం
- చైనా సంప్రదాయ ఔషధాలకు ప్రపంచ వ్యాప్త గిరాకీ
- కోట్ల టర్నోవర్ బిజినెస్ తో చైనాకు లాభాలు
- పాక్ లో గాడిదలన్నింటినీ కొనేసుకు పోతున్న చైనా
- నిరుపేదలకు శక్తికి మించిన భారంగా గాడిదల కొనుగోలు
- గాడిదలను సరకు రవాణా వాహనాలుగా వాడే నిరుపేదలు
- దానితోనే జీవన భృతి, కుటుంబ పోషణ
- చైనా దెబ్బకు దారుణంగా తగ్గిపోయిన గాడిదల సంఖ్య
అసలే పేదరికంతో, అప్పులకుప్పగా మారిన పాకిస్థాన్ లో ప్రతీదీ ఖరీదైన విషయమే.. చివరకు సరుకులు మోసే గాడిదలు కూడా.. ఒక్కో గాడిదను కొనాలంటే అక్కడ రెండు, మూడు లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో అక్కడ గాడిదలు కూడా దొరక్కుండా పోయాయి.. పాకిస్థాన్ గాడిదలు ఇప్పుడు చైనాకు కావాలి.. చైనాలో తయారయ్యే కొన్నిమందులకు గాడిదల చర్మం, కొవ్వు అత్యవసరం.. చైనాలో ఎజావో అనే జెలటిన్ తయారీకి గాడిదల కొవ్వును, చర్మాన్ని వాడతారు.ఆ ఔషధం తయారీ పరిశ్రమ అక్కడ కోట్లలో టర్నోవర్ కలిగి ఉంది.. కాబట్టి చైనాకు పాకిస్థాన్ గాడిదలు ఇప్పుడు అత్యవసరం.
గాడిదలకు గడ్డు కాలం!!
పాకిస్థాన్ లో నిరుపేదలు అట్టడుగువర్గాలకు గాడిదలే జీవనాధారం. అయితే ఇప్పుడు వాటికీ కష్టకాలం, కరువు కాలం వచ్చేసింది. అక్కడ మార్కెట్ లో గాడిద కొనాలంటే మినిమం రెండు లక్షలు ఖర్చవుతుంది. ఇది ఎనిమిదేళ్ల క్రితంతో పోలిస్తే ఏకంగా రూ.30 వేలు ఎక్కువ. గాడిదలను మేపుకుంటూ వాటిని ఇతర పనులకు వినియోగించే అబ్దుల్ రషీద్ కు ఇప్పుడు కష్ట కాలం దాపురించింది. గతవారం ఆతని దగ్గరున్న ఒక్క గాడిదా యాక్సిడెంట్ లో చనిపోయింది.కొత్తగా జంతువిక్రయ మార్కెట్ కు వెళ్లి గాడిదను కొనాలంటే ఆతని వల్ల కావడం లేదు.పాకిస్తాన్ లో గాడిదలకు కరువు కాలం,పైగా ఆకాశాన్నంటుతున్న రేట్లకు కారణం పొరుగునే ఉన్న మిత్ర దేశం చైనా చైనా ఈ గాడిదలను అత్యంత ఖరీదైన రేట్లకు కొనుక్కుని తీసుకుపోతోంది. దాంతో పాకిస్థానీ నిరుపేదలకు గాడిద దొరకడం కూడా గగనమైపోతోంది.
సంప్రదాయ ఔషధాల తయారీ కోసం..
చైనాలో సంప్రదాయ ఔషధాలకు మంచి పేరుంది. పైగా మెజారిటీ జనం అవే వాడతారు. దాంతో విదేశాల్లో కూడా సంప్రదాయ మందులకు మంచి డిమాండ్ ఉంది.. ఎజియావో అనే సంప్రదాయ ఔషధం తయారీకి గాడిదల కొవ్వు,చర్మం అత్యవసరం. ఆ రెంటినీ తీసి బాగా ఉడక పెట్టి ఔషధం తయారు చేస్తారు. కొన్నికోట్ల టర్నోవర్ కలిగిన ఈ ఎజియావో ఇండస్ట్రీ కోసం చైనా పొరుగుదేశంనుంచి గాడిదలు తీసుకుపోతోంది. గాడిద కొవ్వు, చర్మంతో తయారయ్యే ఈ ఔషధానికి ఒత్తిడిని తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచేగుణముంది. శరీరంలో ఎక్కడైనా కణుతులు లేస్తే వాటిని అణచివేసే సామర్ధ్యం ఈ ఔషధానికి ఉంది. అలాగే రక్త హీనతను తగ్గిస్తుంది.. అందుకే చైనాలోనూ, విదేశాల్లోనూ కూడా ఈ ఔషధానికి విపరీతమైన డిమాండ్ ఉంది.
తల బాదుకుంటున్నవ్యాపారులు
పాకిస్థాన్ నిరుపేదలు ఇప్పుడు గాడిదలను కొనలేక సతమతమవుతున్నారు. వారి జీవన భృతికి అవే ఆధారం. మార్కెట్ లో మంచి ఆరోగ్యంగా ,పుష్టిగా ఉన్న గాడిద లక్షల రేటు పలుకుతుంటే ఏం చేయాలో తెలీక గుడ్లనీరు కక్కుకుంటున్నారు. ఏదో ఒకదాన్ని కొందామన్నా హీనపక్షం లక్షా యాభై వేలు పెడితే తప్ప గాడిద దొరకదు. ఒకవేళ దానిపై అంత పెట్టుబడి పెట్టినా ఆ ఆదాయం తిరిగి వెనక్కి వచ్చేదాకా గాడిద ఆరోగ్యంగా ఉంటుందో ఉండదో తెలీదు.
అల్పాదాయ వర్గాల జీవనాధారం
చైనాలో మందుల పరిశ్రమకు గాడిదలు అవసరమైతే పాకిస్థాన్లో బడుగు వర్గాలు గాడిదలను సరకు రవాణా బళ్లుగా వాడుతూ ఆదాయం సంపాదించుకుంటున్నారు. భవన నిర్మాణాలకి అవసరమైన ఇనుము,ఇతర భారీ వస్తువుల తరలింపుకు ఈరోజుకీ అక్కడ గాడిదలనే వాడతారు.ఎంత దూరమైనా అలుపెరగకుండా ప్రయాణించడం కొండలు, గుట్టలు, అడ్డరోడ్ల ద్వారా నడిచే సత్తా వాటికే ఉండటంతో ఆ రకంగా వాటి సేవలు వాడుతున్నారు.ఇలా జీవనాధారం కోసం వాటిని వినియోగిస్తే వారికి వచ్చేది రోజుకు రూ.15 వేలు లేదా రూ. రెండు వేల రూపాయలు.ఇందులో గాడిద పోషణకే సగం ఖర్చయిపోతుంది. మిగతా అరకొర సంపాదనతో కుటుంబం మొత్తం నెట్టుకు రావాల్సి ఉంది. చైనా లాభాల కోసం ఆ రకంగా జీవన భృతిని కూడా పాక్ ప్రజలు కోల్పోతున్నారు. పొరుగున ఉన్న చైనా అదే గాడిదలతో వ్యాపారం చేసి కోట్ల టర్నోవర్ సాధిస్తుంటే.. మింగ మెతుకు లేక బడుగు జీవులు అలో లక్ష్మణా అని అల్లాడుతున్నారు.
