మార్కెట్లోకి ట్రంప్ మొబైల్స్ - స్మార్ట్ఫోన్లు, నెట్వర్క్, స్పెషల్ సర్వీసులు
Trump Mobiles enters the market - smartphones, network, special services

మరోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాలని ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు టెక్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. మొబైల్ ఫోన్ మార్కెట్లోకి ‘ట్రంప్’ బ్రాండ్ ఎంట్రీ ఇస్తోందని అధికారికంగా ప్రకటించారు. ట్రంప్ కుటుంబ అధీనంలో ఉన్న "ది ట్రంప్ ఆర్గనైజేషన్" సంస్థ ద్వారా ఈ కొత్త టెలికం వ్యాపారానికి శ్రీకారం చుట్టారు.
ఈ ప్రాజెక్టును ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ పేరుతో అమెరికాలో మొబైల్ నెట్వర్క్ సేవలందించేందుకు లైసెన్స్ లభించిందని తెలిపారు. తొలిదశలో 5జీ సెల్యులార్ సర్వీసులతో పాటు, ప్రత్యేక మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వీటిని ప్రత్యేకంగా బంగారు వర్ణంలో "T1 ట్రంప్ ఫోన్" పేరుతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
"ప్లాన్ 47" పేరుతో ప్రకటించిన ట్రంప్ మొబైల్స్ టెలికాం ప్యాకేజీలో, వినియోగదారులు నెలకు 47.75 డాలర్లు చెల్లించాలి. ఈ ప్లాన్ కింద అన్లిమిటెడ్ డేటాతో పాటు రోడ్సైడ్ అసిస్టెన్స్, టెలీహెల్త్ వంటి ప్రత్యేక సేవలు కూడా పొందవచ్చు. T1 స్మార్ట్ఫోన్ ధరను 499 డాలర్లుగా నిర్ణయించారు. ఇది Android 15 వర్షన్పై రన్ అవుతుంది.
ఈ ఫోన్ల తయారీ అమెరికాలోనే జరుగుతుందని వెల్లడించినా, నిర్మాణ బాధ్యత ఎవరికి అప్పగించారన్న విషయం మాత్రం గోప్యంగా ఉంచారు. అయితే ట్రంప్కు బంగారు కలర్ అంటే ఉన్న ప్రత్యేకమైన మక్కువ ఈ ఫోన్ డిజైన్లోనూ ప్రతిబింబించింది. గతంలో ఆయన హోటల్స్, ప్రైవేట్ జెట్లు, ఇంటీరియర్ డిజైన్లు సైతం గోల్డ్ టచ్తోనే ఉండేవి.
ఇతర బ్రాండ్ల కంటే తన సర్వీసులు మెరుగ్గా ఉంటాయన్న నమ్మకంతో ట్రంప్ కుటుంబం ఈ వ్యాపారంలోకి దిగింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ నిర్వహిస్తున్నారు.
