తల్లికి వందనం కాదు.. తల్లికి వంచన

Update: 2025-06-12 06:58 GMT
  • మొత్తం పిల్లలు 87,41,885 ఉంటే ఇస్తామంటున్నది 67,27,164 మందికి
  • కాని ప్రకటించిన నిధులు ప్రకారం చూస్తే 58 లక్షల మందికే
  • దాదాపుగా 29 లక్షల మంది పిల్లలకు మోసమే కదా?
  • పథకం అమలుకు కావాల్సింది ఏడాదికి రూ.13,050 కోట్లు
  • గత ఏడాది పూర్తిగా ఎగనామం , రెండేళ్లకు ఇవ్వాల్సింది రూ.26,100 కోట్లు
  • ఈ ఏడాది రూ.8,745 కోట్లు ఇస్తామని ప్రకటన
  • ఇది వంచన కాదా ఎల్‌ఓపీ బొత్స సత్యనారాయణ

కూటమి ప్రభుత్వం ఇస్తోంది తల్లికి వందనం కాదని… తల్లికి వంచన అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ తల్లికి వందనం పథకం కింత విద్యార్థుల తల్లులకు ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవన్‌ అంటూ ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఏడాది గడిపేశారని బొత్స ఎద్దేవా చేశారు. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అప్రజాస్వామికంగా అరాచకంగా పరిపాలన చేసిందని దుయ్యబట్టారు. ఏడాది తరువాత కూడా చంద్రబాబులో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు. తల్లికి వందనం అమలు చేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన చూస్తే ప్రజలను ఏరకంగా వంచిస్తున్నారో స్పష్టమవుతోందన్నారు. మా ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా ప్రతియేటా అమ్మఒడి అమలు చేశామని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని రద్దు చేసి గడచిన విద్యా సంవత్సరంలో తల్లులకు డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూడీఐఎస్‌ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ మొత్తం 87 లక్షల 41వేల 885 మంది చదువుకునే పిల్లలు ఉంటే కూటమి ప్రభుత్వం 67 లక్షల 27 వేల 164 మంది పిల్లలకు మాత్రమే ఇస్తామని ప్రకటించిందని బొత్స సత్యనారాయణ అన్నారు. తీరా కేటియించిన నిధులు చూస్తే 58 లక్షల మందికే అమలయ్యే పరిస్ధితి కనిపిస్తోందని ఇది వంచన కాదా అని బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. వాస్తవానికి విద్యార్థులందరికీ రూ.15వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13వేల 050 కోట్లు అవసరమవుతాయని బొత్స వివరించారు. గత ఏడాది బకాయిలతో కలిపి మొత్తం 26 వేల వంద కోట్ల నిధులు కావాలని చెప్పారు. ఇప్పుడు రూ. 8,745 కోట్లు మాత్రమే నిధులు కేటాయించినట్లు విద్యాశాఖ మంత్రి ట్వీట్‌ చేశారని వారు చెప్పిన పిల్లల సంఖ్య ప్రకారం చూస్తే రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే ఆ నిధులు సరిపోవని బొత్స తెలిపారు. ఈ లెక్కన దాదాపు 29లక్షల మంది తల్లులను వంచించినట్లే అని బొత్స ఆరోపిస్తున్నారు. ఈ అంకెలు చూస్తుంటే ఏదోరకంగా మభ్యపెట్టేలా ప్రభుత్వ ధోరణి కనిపిస్తోందని ఇది మహిళలను మోసం చేస్తున్నట్టు కాదా? తల్లులను వంచిస్తున్నట్టు కాదా? అని బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Tags:    

Similar News