గోదావరి నదిలో8 మంది గల్లంతు

Update: 2025-05-27 05:01 GMT

గోదవరి నదిలో ఎనిమిది మంది యువకులు గల్లంతైన విచారకర సంఘటన కోనసీమ జిల్లాలో జరిగింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలోని కమినిలంక పంచాయితీ పరిధిలోని సలాదివారిపాలెంలో తీవ్ర విషాదం ఛాయలు నెలకొన్నాయి. సోమవారం కమినిలంక గ్రామానికి ఒక శుభకార్యానికి వచ్చిన 11 మంది యువకులు సమీపంలో శేరిలంకలో ఉన్న గోదావరి పాయలో స్నానానికి దిగారు. అక్కడ గోదావరి లోతుగా ఉండటంతో వారిలో 8 మంది గల్లంతయ్యారు. యువకులంతా 14 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారే. గల్లంతైన వారిని కాకినాడ, రామచంద్రపురం, మండపేటలకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీశ్, మహేశ్, రాజేశ్, రోహిత్, మహేశ్గా గుర్తించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్నానానికి వెళ్లిన వారిలో ఎలిపే మహేష్ అన్న యువకుడు లోతుగా ఉన్న ప్రాంతంలో దిగి మునిగిపోయాడు. అతన్ని రక్షించే ప్రయత్నంలో దిగిన మిగిలిన ఏడు మంది కూడా గోదవరిలో గల్లంతయ్యారు.

విషయం తెలుసుకున్న కే.గంగవరం, ఐపోలవరం, ముమ్మిడివరం పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని నాటు పడవలపై గాలింపు చర్యలు ప్రారంభించారు. రాత్రి తెల్లవార్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఎస్పీ బి.కృష్ణారావులు పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నారు.

సీయం దిగ్భ్రాంతి

గోదావరి స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది గల్లంతవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

వైఎస్ జగన్ విచారం

కోనసీమ జిల్లాలో 11మంది యువకులు గోదావరి నదిలో గల్లంతవడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్సీపీ అధినేత వైఎస్‌.జగన్మోహనరెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Similar News