ఎవరికీ పట్టని రాష్ట్రం... అనాధాంధ్రప్రదేశ్…
- వీకెండ్లలో రాష్ట్రం విడిచి పోతున్న నేతలు
- సెటిల్మెంట్లు అన్నీహైదరాబాద్ స్టార్ హోటల్స్ లోనే
- ఆంధ్రరాష్ట్రంపై వాత్సల్యం లేని నేతలు
- నాయకులు, ప్రజలలో సైతం కొరవడిన ఆంధ్రభావన
ఏ ముహుర్తాన రాష్ట్ర విభజన జరిగిందో కానీ ఆ నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఇక అనాధ రాష్ట్రంగా మారిపోయింది. రాష్ట్రంపై ప్రాంతంపై ఎవరికీ ప్రేమ లేదు, వాత్సల్యం లేదు. అధికారం ఉందా… ఉన్నంత కాలం పదవులు అనుభవిద్దాం… కోట్లు వెనకేసుకుందాం… ఇదే ధోరణి నేతలందరిలో కనిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగి పదకొండేళ్ళు పూర్తయ్యింది. ఈ పదకొండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ తో ఆత్మీయ అనుబంధం పెనవేసుకుపోయిన ఒక్కరంటే ఒక్క రాజకీయ నాయకుడు కనిపించలేదు. అసలు స్వరాష్ట్ర భావన అనేది ప్రజల్లోనే కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలగాణ వేరుపడ్డాక ఏపీని పొత్తిళ్ళలో సాదుకుని ఇటుక ఇటుక పేర్చి అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం నేతలెవ్వరిలో ఉన్నట్లు ఇప్పటి వరకూ బహిర్గతం కాలేదు. ఎవరిలో చూసినా వ్యాపారేచ్ఛ తప్పితే ఇది నారాష్ట్రం… నారాష్ట్రాన్ని సర్వతోమఖాభివృద్ధి చేసుకోవాలి… భవిష్యత్తు తరాలకు ఒక మంచి సమాజాన్ని అందించాలన్న కాంక్ష ఎవరిలో వ్యక్తమవ్వడం లేదు. ఇప్పటికీ చాలా మంది నేతలు చుట్టపు చూపుగా ఆంధ్రప్రదేశ్ వచ్చి పోతున్నారు తప్పితే ఇది నారాష్ట్రం ఏదైనా ఈ రాష్ట్రంలోనే నా జీవితం అనే దృక్పథం ఉండటం లేదు.
అధికార పక్షానికి చెందిన నేతలు కూడా ఇందుక మినహాయింపు కాదు. వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం కొందరు ఆంధ్రప్రదేశ్ మంత్రుల పర్మినెంట్ అడ్డాలుగా హైదరాబాద్ లో ని స్టార్ హోటల్సే అని కూటమి పార్టీ నేతలే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే గడచిన ఏడాది కాలంలో షూటింగుల్లోనే ఎక్కువ రోజులు గడిపారనేది జనసేన నేతలే ఒప్పుకుంటున్నారు. జగన్మోహనరెడ్డిని గద్దె దింపాలనే కిల్లర్ ఇన్స్టింక్ట్ తప్పితే ఆంధ్రరాష్ట్రంపై ప్రేమ ఎక్కడా ఆయనలో కనిపించడం లేదనే వాదన రాజకీయవర్గాల్లో ప్రచారంలో ఉంది. తానేదో నిమిత్త మాత్రుడిలా రాష్ట్రంలో జరిగే చాలా విషయలపై పవన్ కళ్యాణ్ నుంచి మినిమమ్ స్పందన కనిపించదు. చాలా సెలక్టివ్ గా ఆయన స్పందన ఉంటుంది. చాలా క్యాబినేట్ సమావేశాలకు ఆయన గైర్హాజరయ్యారు. ఒక వేళ ఏపీలో ఉన్నా కూడా జనసేన పార్టీ కార్యాలయం పక్కనే వేసి సెట్ లో షూటింగ్ చేస్తూ ఉంటారనే ప్రచారం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కీలక మంత్రి నారా లోకేష్ లు కూడా వీకెండ్ కి హైదరాబాద్ వచ్చి మళ్ళీ సోమవారం ఉదయమే స్పషల్ ఫ్లైట్లలో అమరావతి చేరుకుంటున్నారు. ముఖ్యమైన సమావేశాలు, ములాఖాత్ లు అన్నీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలోనే జరుగుతున్నాయనే ప్రచారం ఉంది.
అధికార పార్టీ నేతల వ్యవహారం ఇలా ఉంటే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పరిస్ధితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. వైఎస్.జగన్మోహనరెడ్డి అయితే వారంలో దాదాపు మూడు రోజులు ఆంద్రప్రదేశ్ వెలుపలే ఉంటున్నారు. అంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్.జగన్ కేవలం అదికారిక కార్యకలాపాలకు తప్పితే రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లింది లేదు. కానీ ప్రతిపక్షంలోకి వచ్చాక ఆయన కూడా వారంలో మూడు నాలుగు రోజులు బెంగుళూరులో గడుపుతున్నారు. ఇక ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులైతే చాలా మంది రాష్ట్రం వెలుపలే ఉంటున్నారు. చివరికి కొంత మంది నేతలు ప్రెస్ మీట్లు కూడా హైదరాబాద్ లో పెడుతున్నారు. ఈ విధంగా ఆంద్రప్రదేశ్ లో ఏ పార్టీ నాయకులను చూసినా వారిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ కు చుట్టపుచూపుగా వచ్చి పోతున్నారు తప్పితే రాష్ట్రం మీద వారిలో ఏమాత్రం అభిమానం కనిపించడం లేదు. విభజనతో తీవ్ర సంక్షోభంలో పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పసిబిడ్డలా చూసుకోవాల్సింది పోయి తమ స్వలాభాల కోసం పరిస్ధితులను వాడుకోవాలని చూస్తున్నారు. దీంతో ఎవరికీ పట్టక… ఎవరూ పట్టించుకోక ఆంధ్రప్రదేశ్ అనాధలా మిగిలిపోతోందనే ఆవేదన పాత తరం నాయకులు చాలా మందిలో ఉన్న వారికి వ్యక్త పరిచే వేదిక దొరకడం లేదు.
ఆంద్రప్రదేశ్ లో పరిస్ధితులు ఎలా ఉన్నాయన్న విషయం అవగతమవడానికి ప్రముఖ డైరెక్టర్ తేజ ఒక ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నాయకుల గురించి చేసిన వ్యాఖ్యలు అద్దం పడతాయి. ఎన్నో దశాబ్ధాల చరిత్ర కలిగిన ఆంధ్రబ్యాంక్ ను కేంద్రం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేసినప్పుడు ఏ ఒక్కరూ అదేమని ప్రశ్నించలేదని, అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తే పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకులు, ప్రజలు తిరగబడ్డారని డైరెక్టర్ తేజా ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఆంధ్ర పేరుతో ఉన్న ఏకైక బ్యాంకు పేరు మార్చేస్తుంటే ఏ ఒక్క ఆంధ్రుడూ సిగ్గుపడకుండా కనీస నిరసన తెలపలేదని అప్పుడు తనకు చాలా కోపం వచ్చిందని డైరెక్టర్ తేజా చేసిన వ్యాఖ్యలు కూడా ఆంధ్రప్రదేశ్ అనాధగా తయారవుతోందనడానికి బలం చేకూరుస్తున్నాయి.