Adulterated Ghee Case: వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్పటి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈవో) అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ అండ్‌ చీఫ్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఏ అండ్‌ సీఓ) బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ప్రభుత్వానికి లేఖ రాసింది.

సిట్‌ ఇటీవలే కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో, 14 పేజీల లేఖలో ఈ ముగ్గురు ఉన్నతాధికారులపై చర్యలు సూచించింది. నెయ్యి సరఫరాకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను బలహీనపరిచేలా వ్యవహరించారని, నిబంధనల తయారీలో నిర్లక్ష్యం చూపారని, దీంతో నెయ్యి నాణ్యతలో రాజీ జరిగిందని (కాంప్రమైజ్‌ ఆఫ్‌ క్వాలిటీ ఆఫ్‌ ఘీ) సిట్‌ స్పష్టం చేసింది.

ప్రస్తుత ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శని లేదా ఆదివారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

నిబంధనల సడలింపు.. కల్తీకి దారితీసింది

2019 ముందు ఉన్న కఠిన నిబంధనలను వైకాపా అధికారంలోకి వచ్చాక మార్చేశారు. టెండర్లలో పాల్గొనే డెయిరీలు పాలు సేకరించాల్సిన అవసరం లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం అవసరం లేదని సడలించారు. మూడేళ్ల కార్యకలాపాల నిబంధనకు మినహాయింపు ఇచ్చారు. టర్నోవర్‌ మొత్తాన్ని రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించారు.

ఈ సడలింపుల వల్లే 2019 నుంచి 2024 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయిందని సిట్‌ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో భోలేబాబా డెయిరీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషించాయి.

ఈ కేసు భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. సిట్‌ సిఫార్సులతో పాటు ప్రభుత్వ చర్యలు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది.

Tags: