Ambati Rambabu: అంబటి రాంబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
సీఎం చంద్రబాబుపై అసభ్య, అసహ్యకర వ్యాఖ్యల కేసులో గుంటూరు స్పెషల్ కోర్టు ఉత్తర్వు
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలింపు
Ambati Rambabu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అసభ్య, అసహ్యకర వ్యక్తిగత దూషణలు చేసిన వైఎస్ఆర్సిపి నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం.
న్యాయమూర్తి జి. స్రవంతి ఆదివారం రాత్రి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అంబటిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
శనివారం సాయంత్రం గుంటూరు గోరంట్ల వద్ద అంబటి రాంబాబు తన వాహనంలో వెళ్తుండగా పోలీసుల సమక్షంలోనే చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అంబటిని శనివారం రాత్రి అరెస్టు చేశారు. ఆయన్ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి మెడికల్ పరీక్ష చేయించి, ఆ తర్వాత స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరు పరిచారు.
కోర్టులో పోలీసులు 14 రోజుల రిమాండ్ కోరగా, న్యాయమూర్తి రెండు వైపుల వాదనలు విని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ఆదేశించారు.
అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై "చంద్రబాబును ఉద్దేశించి అలా మాట్లాడాల్సింది కాదు" అని కోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుతో పాటు అంబటిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంటిని ముట్టడించిన టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు భారీ బలగాలతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.