ఏపీలో అరాచక పాలన - వైఎస్ జగన్ ధ్వజం
Anarchy in AP - YS Jagan fire;
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని, ప్రజల అభిప్రాయాలను అణచివేస్తూ, ప్రశ్నించే గొంతులను నొక్కేయాలన్న దురాలోచనతో వ్యవహరిస్తున్నదని ఏపీ మాజీ సీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దుయ్యబట్టారు. ఇది పాలన కాదని, అప్రకటిత నిషేధమని అభివర్ణించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది పూర్తయిన జూన్ 4వ తేదీన వైఎస్సార్సీపీ నిర్వహించిన "వెన్నుపోటు దినం" కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందన్నారు. నాయకులు పర్యటించే ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడం, పోలీసులు నియంత్రణలు విధించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడమే చంద్రబాబు విధానంగా మారిందని మండిపడ్డారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మిధున్రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్ తదితర నేతలపై అక్రమ కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ఆఫీసులపై దాడులు సైతం వ్యూహాత్మకంగా జరిగాయని ఆరోపించారు.
పొగాకు, మామిడి, వరి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, ప్రకాశం జిల్లాలో ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించలేదని ఆయన ఆరోపించారు. అనంతపురం జిల్లాలో 9వ తరగతి బాలికపై 14 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినా, ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. అదే విధంగా ఇంటర్ బాలిక మృతిపై పోలీసుల నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు.
ఉచిత బస్సు, పెన్షన్, రైతులకు పెట్టుబడి సాయం, మహిళలకు పథకాలు వంటి వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్య రంగాల పరిపాలన పూర్తిగా విచ్చిన్నమైందని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రకటించిన టీడీపీ మ్యానిఫెస్టోను చూపి, తమకు ఎంత బాకీ ఉందో ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘చంద్రబాబు మ్యానిఫెస్టో గుర్తు తెచ్చుకుంటూ’ అనే క్యూఆర్ కోడ్ ద్వారా క్యాంపెయిన్ ప్రారంభించనున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు.