ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్‌లో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో సమావేశం


Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu: ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) నేపథ్యంలో దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో మర్యాదపూర్వక సమావేశం జరిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనను సత్కరించి జ్ఞాపిక అందజేశారు.

రాష్ట్రంలో మూడు క్రీడా నగరాల నిర్మాణం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నామని, వాటిలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించాలని సీఎం టాటా ఛైర్మన్‌కు ప్రతిపాదించారు. అలాగే, రాష్ట్రంలో టాటా గ్రూప్ చేపట్టిన పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు.

సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "గత ఏడాది దావోస్ సదస్సులో జరిగిన చర్చల ఫలితంగా ఇప్పటికే రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో గ్రౌండింగ్ అయ్యాయి. ప్రపంచ పారిశ్రామిక పోకడలు, పెట్టుబడిదారుల ఆలోచనలను తెలుసుకోవడానికి దావోస్ ఉత్తమ వేదిక. ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా చేసేందుకు, కొత్త పాలసీలపై మార్కెట్ అంచనాలు సేకరించడానికి ఈ పర్యటన దోహదపడింది. మూడు రోజుల్లో గ్రీన్ ఎనర్జీ, సాంకేతికత, కృత్రిమ మేధస్సు, వ్యవసాయం, పర్యాటక రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని పారిశ్రామికవేత్తలకు వివరించాను. గతంతో పోలిస్తే భారత్‌కు ప్రపంచ దిగ్గజ సంస్థలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి" అని తెలిపారు.

చంద్రశేఖరన్ తన అనుభవాలను పంచుకున్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాల నిర్వహణకు టాటా ట్రస్ట్ నుంచి అధికారులను పంపుతామని, రాష్ట్రంలో టాటా ప్రాజెక్టులపై సమీక్షించి వాటిని త్వరగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

విశాఖపట్నంలో టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, కర్నూలులో ప్రతిపాదిత సౌర విద్యుత్ ప్రాజెక్టుల పురోగతిపై ఇద్దరూ వివరంగా చర్చించారు. టాటా గ్రూప్ ప్రాజెక్టుల పూర్తి సహకారంతో త్వరగా అమలు చేయాలని రెండు వర్గాలూ అంగీకరించాయి.

ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులకు మరింత ఊతమిచ్చే అంశంగా మారింది.

Tags: