AP BJP President : జూలై 27 నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడి సారధ్య యాత్ర
ఐదు విడతలుగా రాష్ట్రమంతా పర్యటించనున్న మాధవ్;
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఏవిధంగా అభివృద్ధి బాటలో వెళుతోందో ప్రజలకు వివరించడానికి సారధ్యం పేరుతో అన్ని జిల్లాలు పర్యటించి ప్రచారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. శుక్రవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ ఎదిగిందన్నారు. ప్రధాని మోడీ దేశాన్ని ఒక గ్లోబల్ ఫోర్స్ గా తీర్చిదిద్దారన్న విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. అందుకే జూలై 27వ తేదీ నుంచి కడప జిల్లా నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నట్లు మాదవ్ ప్రకటించారు. ఆ మర్నాడు 27వ తేదీ నంద్యాల, 29న కర్నూలు, 30న అనంతపురం, 31న సత్యసాయి జిల్లాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. రెండో విడతలో ఆగస్టు నాలుగు నుంచి పల్నాడు, 5వ తేదీన గుంటూరు, 6న బాపట్ల, 7న ఒంగోలు జిల్లాలు పర్యటించనున్నట్లు తెలిపారు. మూడో విడతలో ఆగస్టు 10న అన్నమ్య జిల్లా, 11న చిత్తూరు, 12న తిరుపతి, ఆగస్టు 13న నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నట్లు మాదవ్ పేర్కొన్నారు. మొత్తం ఐదు విడతలుగా సారధ్య కార్యక్రమం కొనసాగుతుందని మాధవ్ ప్రకటించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో బీజేపీ చిత్తశుద్ధితో ఉందన్నారు. అమరావతిని అనుసంధానించేందుకు రైల్వే కనెక్టివిటీ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో అనేక నిర్మాణాలకు కేంద్రం సహాయం చేస్తోందని తెలిపారు. ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులతో అనేక అంశాలపై చర్చించినట్లు మాధవ్ పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి తొడ్పాటు అందించటంలో ముందుంటామని ప్రదాని మోదీ హామీ ఇచ్చారన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో కూటమి నాయకులతో కలసి నిర్ణయం తీసుకుంటామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు.