AP Cabinet Approves 35 Agenda Items: ఏపీ కేబినెట్: 35 అజెండా అంశాలకు ఆమోదం.. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ నివేదికపై చర్చ
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ నివేదికపై చర్చ
AP Cabinet Approves 35 Agenda Items: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 35 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) లడ్డూ తయారీలో నెయ్యిలో కల్తీ ఆరోపణలపై సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఇచ్చిన నివేదికపై కూడా మంత్రివర్గ భేటీలో విస్తృత చర్చ జరిగింది.
వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, సిట్ నివేదికను అధికారికంగా తెప్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయాన్ని అధికారులు సమావేశంలో తెలిపారు. నివేదిక అధికారికంగా అందిన తర్వాత దానిపై స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు.
కేబినెట్ ఆమోదించిన కీలక నిర్ణయాలు:
పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్) పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు ఆమోదం.
ఎస్వీ విశ్వవిద్యాలయం పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ చేసే అంశంపై చర్చ.
పలమనేరులో లైవ్స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి బదిలీకి ఆమోదం.
అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖపట్నంలో 500 చదరపు గజాల స్థలం కేటాయింపు. అలాగే డిగ్రీ తర్వాత గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం.
ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారెంటీకి ఆమోదం.
అమరావతి పరిధిలో వీధిపోటు భూములు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయింపు.
అమరావతి పరిధిలో భూములు లేని పేదలకు, అనాథ పిల్లలకు పింఛన్ల మంజూరుకు ఆమోదం.
తితిదే పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడేషన్, వివిధ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం.
అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్స్టార్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్కు ఏర్పాటుకు భూకేటాయింపులకు ఆమోదం.
పలు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు.
ఇంధన శాఖలో పలు పరిపాలనా అనుమతులకు ఆమోదం.
తిరుపతి, విశాఖపట్నం శిల్పారామం ప్రాజెక్టుల కోసం M/s గార్డెన్ సిటీ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్కు జారీ చేసిన LOIలను రద్దు చేసి, కొత్తగా EOIలు ఆహ్వానించాలని నిర్ణయం.
పీపీపీ విధానంలో గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం, వినోద జోన్ అభివృద్ధికి ఆమోదం.
ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం తదితర రంగాలకు బలం చేకూర్చనున్నాయి. మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ అంశాలు అమలు కోసం సంబంధిత శాఖలకు సూచనలు జారీ చేయనున్నారు.